15 అక్టోబర్, 2010

మీటింగ్‌లో నిద్రపోతే....?

పోయిన వారం నాకు ఆఫీసులో ఒక మీటింగ్ జరిగింది. అది కూడా లంచ్ అవ్వగానే పెట్టారు. మా టీం అంతా కలిసి లంచ్ చేసాం. ముందురోజు డిన్నర్ సరిగా చెయ్యకపోవడం వల్లనో, లేకపోతే ఆరోజు పొద్దున బ్రేక్‌ఫాస్ట్ చెయ్యకపోవడం వల్లనో, కాదంటే లంచ్ రుచిగా వుండడం వల్లనో తెలీదు కానీ భీభత్సంగా కుమ్మేసా. ఇంకేముంది, నిద్ర తన్నుకురావడం మొదలైంది. డెస్కు దగ్గరికెళ్లి కాసేపు నిద్ర పోదామని ఆలోచిస్తూ మెల్లగా కేఫిటేరియాలోంచి బయటకు వస్తూంటే మా లీడ్ పద్మజ గారు గుర్తు చేసారు "పెద్ద తలకాయల"తో మీటింగ్ వుంది కదా ఇప్పుడు అని. అందరం కలిసి మీటింగ్ వున్న ఆడిటోరియంలోకి వెళ్లాం. అప్పటికే మీటింగ్ స్టార్ట్ అయిపోయింది. హాల్లో ఒక 100 వరకు కుర్చీలు వేసారు. చివర్లో అన్నీ నిండుగా వున్నాయి. కూర్చోడానికి ఎక్కడా ప్లేసులేదని కుర్చీల వెనకాల స్నాక్సు కోసం వేసిన టేబుల్స్ మీద కూర్చున్నాం అందరం. ఒక రెండు నిమిషాలు ప్రశంతంగా కూర్చుని ఇలా సెటిల్ అయ్యానో లేదో ముందు నుంచి నా పాలిటి లేడీ విలన్ లేచి మట్లాడుతున్న జెంటిల్‌మాన్ దగ్గర మైకు లాక్కుని "వెనక టేబుల్సు దగ్గర సెటిల్ అయిన వాళ్లందరూ ముందుకు వస్తె అక్కడ కుర్చీలు ఖాళీగా వున్నాయి రండి" అని ఆహ్వానించింది. మనకి బాడ్ టైం స్టార్ట్ అయ్యింది.

అప్పుడు కదిలి చూస్తే మనకంటే లేటుగా మీటింగుకి చాలామందే వచ్చారు.అందరం కలిసి ముందుకు వెళ్లాం. అందరం ఒక వరుసలో కూర్చున్నాం. గోడ వైపు మా లీడు, పక్కన మా టీమువాళ్లు, చివర్లో... దారికి దగ్గరగా నేను. తీరా చూస్తే నేను కూర్చుంది రెండో వరుసలో. మొదటి వరుస నా ఖర్మ కాలి ఖాళీగా వుంది. అంతా బాగానే వుంది కానీ మా ప్రవీణ్‌గాడు కనపడట్లేదేంటి చెప్మా అని వెనక్కి చూసా. నా వెనక వరుసలో రెండు కుర్చీల అవతల ప్రవీణు, వాని వెనకాల నా మేనేజరూ కూర్చున్నారు. అప్పుడే నాకు కుడి కన్ను అదిరింది, అంటే సిక్స్త్ సెన్స్ పనిచేసింది. కానీ దాన్ని పట్టించుకునే మూడ్‌లో ఆ క్షణంలో నేను లేను.

ఒక అయిదు నిమిషాలయ్యింది. అప్పటిదాక మట్లాదుతున్న పెద్దాయన స్పీచుకూడా అయ్యింది. మమ్మలని ముందుకు పిలిచిన నా లేడీ విలన్ లేచి ఏదో గేం అంటూ నేను రెండో తరగతిలో వుండగా ఒక ఈమెయిల్‌లో వచ్చిన ఫొటో చూపింది. చాలా కాఫీ గింజల మధ్య ఒక మనిషి ఫేసు వుండే ఫొటో అది. ఆ ఫొటో చూపగానే ఆమెకో ఫోన్ వచ్చింది. మమ్మల్నందరినీ లైన్‌లో వుండమని చెప్పి ఆమె మాత్రం మాట్లడ్డానికి బయటికెళ్లింది. ఒక అయిదు నిమిషాల తర్వాత వచ్చి కొన్ని క్వెశ్చన్స్ వేసింది. అదేంటో, నాకు తప్ప అక్కడ ఎవ్వరికీ ఆన్సర్స్ తెలీవనుకుంటా. నేను తప్ప ఎవ్వరూ జవాబు చెప్పలేదు. నాకూ, నా విలన్ కు మధ్య డిస్కషన్ ఇలా జరిగింది.

విలన్: ఈ ఫొటోలో వున్నదేంటి...?
నేను: కాఫీ గింజలు.
విలన్: గుడ్. నువ్వు లేచి నిలబడు.
నేను: (లేచి నిలబడ్డా)
విలన్: దీనితో ఏం చెయ్యొచ్చు...?
నేను: ఫొటోనయితే సిస్టంలో వాల్‌పేపర్ గా పెట్టుకోవచ్చు. గింజలతో అయితే కాఫీపొడి చేసి దానితో కాఫీ చేసుకుని తాగొచ్చు. ఒక అయిదు నిమిషాలు టైమిస్తే ఇంకేమైనా చెయ్యొచ్చేమో గూగుల్ చేసి చెప్తా.
విలన్: బ్రహ్మాండం. అసలు నీలాంటి వానికోసమే నేను ఎదురుచూస్తున్నా. నీ అంత ఇంటెల్లిజెంట్ లేక ఇన్ని రోజులు మా మీటింగ్స్ అన్ని తెగ బోరు కొడుతున్నాయి. ఇంకొక్క ప్రశ్న వుంది, దానికి కరెక్ట్ అన్సర్ చెప్తే నీకొక సర్‌ప్రైజ్ గిఫ్ట్.
నేను: డౌటొద్దు. గిఫ్ట్ నాదే. నువ్వడుక్కో.
విలన్: కాఫీ స్పెల్లింగ్ ఏంటి...?
నేను: కే ఏ యూ పీ హెచ్ వై

అంతే, గిఫ్టు నాదైపోయింది. ఆడిటోరియం అంతా చప్పట్లతో దద్దరిల్లింది. ఆ చప్పట్లమోత నా చెవుల్లో గింగిరాలు తిరుగుతూంటే తల విదిలించా. చూస్తే నేను కూర్చొనే వున్నా. విలన్ ముందు కనపడలేదు. కానీ చప్పట్లు మోగుతున్నాయి. వెనక్కి తిరిగి చూస్తే విలన్ వేరేవాళ్లకి గిఫ్ట్ ఇస్తోంది. మనం రికగ్నైజ్ చెయ్యక కానీ, తర్వాత మా ప్రవీణ్ కి కూడా ఒక గిఫ్టొచ్చింది. అది నాకు మీటింగయ్యాక తెలిసొచ్చింది. పాపం, వానికి గిఫ్టొచ్చినప్పుడు నేను చప్పట్లు కొట్టలేదని ముందు ఫీలయ్యాడు కానీ తరువాత అర్థం చేసుకున్నాడు.

మళ్లీ స్పీచులు మొదలయ్యాయి. ఇంక నన్నడక్కండి. ఎంత మంది వచ్చారో, ఎంత సేపు దంచారో, గంటన్నర ఎలా గడిచిందో నాకైతే తెలీదు. మధ్య మధ్యలో ఒకటి రెండు సార్లు వెనక్కి తిరిగి చూస్తే మా ప్రవీణుడు వెటకారంగా ఒక స్మైల్ పడేసాడు. (అంటే నేను నిద్ర పోతున్నానన్న విషయం వాడు పట్టేసాడు) నేను అలా వెనక్కి తిరిగిన ప్రతీసారీ నన్ను ఎవరో తట్టినట్టనిపించే చూసాను. అది వేరే విషయం. రెండోసారి చూసినప్పుడు అనిపించింది... నా పక్కన కూర్చున్న వినోద్ నన్ను తడుతున్నాడు అని. ఎందుకైనా మంచిది కంఫర్మ్ చేసుకుందామని అడిగా "నీకు కాలేజీ రోజుల్లో నిద్రపోతున్న వాళ్లని లేపే అలవాటు బాగా వుండేదా...?" అని. 'యెప్పీ' అని స్టైల్‌గా చెప్పాడు.

అలా అలా మీటింగ్ అంతా అయిపోయి బయటికొచ్చాక తెలిసింది ఏమీ అంటే, చివర్లో మాట్లాడిన మాస్టారు అందరికంటే పెద్దతలకాయంట. జోకులు కూడా బాగా పేల్చాడంట. నన్ను ఆఅహించిన నిద్రాదేవత విశ్వరూపాన్ని కూడా చూసాడంట. మా ప్రవీణడు చెప్పాడు... "ఆ పెద్దతలకాయ ప్రతీ జోకుకి జోకుకి మధ్యలో నీవైపు కంఫ్యూజింగ్‌గా చూసాడు. అందరి నవ్వులకి నువ్వు తల విదిల్చి నవ్వుతుంటే అది వేసిన జోకుకి నవ్వావో, వేయబొతున్న జోకుని ఎక్స్‌పెక్ట్ చేసి నవ్వావో అర్థం కాక.. పాపం" అని.

అసలు పోస్ట్ లంచ్‌లో ఇలాంటి మీటింగ్స్ పెట్టేదే సుఖంగా నిద్ర పోవటానికి నా ఫీలింగ్. అలాగే ఈరోజు కూడా ఒక మీటింగ్ పెట్టారు, తెల్లవారుఝామున ఎనిమిదిన్నరకి. దానికితోడు మాటీమువాళ్లందరికీ ఈ మొదటిబెంచీలో కూర్చునే అలవాటు ఏంటో అర్థం కాదు. వెనక కొన్ని సీట్లు ఖాళీగా వున్నాకూడా వెళ్లి మళ్లీ రెండో వరసలో కూర్చున్నారు. అందులో మొదటి స్లైడ్‌లోనే దయచేసి గురకపెట్టొద్దు అని చెప్పారు. అంటే సైలెంటుగా నిద్ర పోవచ్చనే కదా. మరేంటి, ఆ స్లైడ్ చుస్తూనే మా టీమువాళ్లంతా నవ్వుతూ నావైపు చూసారు....?

12 అక్టోబర్, 2010

తొక్కలో జీవితం... ఇంతేనా... ఇంకేం లేదా....?

ఇండియాలో వున్నప్పుడు లైఫ్ చాలా బాగుండేది. వీక్ డే లో అయితే తెల్లవారుఝామున (నా ఫ్రెండ్సు అది తెల్లవారుఝాము కాదు, పొద్దున అంటారు. మీరు నమ్మొద్దు) లేచి తయారయ్యి ఆఫీసుకి వెళ్లి లంచవర్లో ఏ చెత్తో తినేసి, సాయంత్రం ఇంకేదో గడ్డి తినేసి రాత్రి వరకు చెమటోడ్చి(?) పని చేసి మధ్యలో బ్లాగులు చదువుతూ, అప్పుడప్పుడు కామెంట్లు పెడుతూ, ఓపిక వుందని అనిపించినప్పుడు పోస్టులు వేస్తూ టైంపాస్ చేసేవాన్ని. ఇక వీకెండైతే పండగే. మరీ తెల్లవారుఝామున లేవాల్సిన పని లేదు కాబట్టి కాస్త పొద్దెక్కాక లేచేవాన్ని (దీన్ని నా ఫ్రెండ్సు మధ్యాహ్నం అంటారు. ఆస్ యుజువల్ గా మీరు నమ్మినట్టు నటించండి, కానీ నమ్మొద్దు). ఫ్రైడే నైటు పార్టీ, శనివారం రాత్రి గాలి తిరుగుడు, ఆదివారం రాత్రి సినిమా.... ఇలా సరదాగా సాగిపోయేది. ఒకరోజు మామూలుగా ఆఫీసుకి వెళ్లి బ్లాగులు చదువుతుంటే మధ్యలో ఒక ఫ్రెండు పింగ్ చేసాడు. మాటల మధ్యలో "విధి చాలా బలీయమైనది. అది మనం కోరుకున్నదానికి సరిగ్గా అప్పోసిట్ గా చేస్తుంది" అని అన్నాడు. వాడు ఏ క్షణాన అన్నాడో గాని, అన్నాక రెండు రోజులకి నా మేనేజర్ పిలిచి నువ్వు ఫారిన్ వెళ్ళాలి, అన్ని రెడీ చేసుకో అని చెప్పాడు.

ఫారిన్‌లో ఎలా వుంటుందో ఆల్రెడీ ఆన్సైటుకెళ్లొచ్చిన వాళ్ల దగ్గర చాలా విన్నాను కాబట్టి, దానికి తగ్గట్టుగానే చాలా ప్లాన్స్ కూడా వేసుకున్నా... ఇక్కడికొచ్చాక జిమ్ముకెళ్లి పొట్ట తగ్గించాలి, వీలైతే 8 ప్యాక్, లేదంటే 6 ప్యాక్ అయినా పెంచేసి, మల్లి బెంగళుర్ లో ఆఫీసుకెళ్లే రోజు కి మొత్తం అవుట్ లుక్ ని మార్చేసి, అమ్మాయిలందరికీ షాక్ ఇచ్చి... అబ్బో... చాలా చాలా వూహించేసుకున్నా. కానీ, విధి చాలా బలీయమైనది. నా బద్దకం అంతకంటే బలమైనదన్న విషయం నాకు ఇక్కడికొచ్చాక అర్థం అయ్యింది. నేను ఇక్కడుండేది మూడు నెల్లు. అందులో నెలన్నర నాకు జిం ఎక్కడుందో కనుక్కోవడానికే పట్టింది. ఇంక అందులో కార్డ్ తీసుకోవాల్సిన ప్రాసెస్ తెలుసుకోవడానికి ఇంకో 2 వీక్స్. మిగిలింది ఒక్క నెల. ఈ ఒక్క నెలలో మనం జిం లో చేరి సాధించగలిగేది ఏం లేదని నాకు నేను అనుకుని జిం గురించి ఆలోచించడం మానేసి, తిరిగి, చూసి, చుట్టెయ్యాల్సిన ప్లేసుల గురించి రీసెర్చ్ చెయ్యడం మొదలెట్టా.

ఇప్పుడు చూస్తే ఒకరోజు లావు పెరిగాననిపిస్తుంది. ఒకరోజు బరువు తగ్గాననిపిస్తుంది. మొన్న వెయిట్ చూసుకుంటే 4 కిలోలు తగ్గానని చెప్పింది. నిన్న పాంట్ వేసుకుంటే ఇదివరకట్లో బాగుందనిపించింది ఇప్పుడు టైటయినట్టు అనిపించింది. ఇంత కంఫ్యూజన్ ఏంటో అర్థం కావట్లేదు. ఇంటికెళ్లాక బంధు మిత్ర సకుటుంబ సపరివారమంతా ఏమంటారో చూస్తే అప్పుడు కానీ అర్థం అయ్యేలా లేదు అసలు నా పరిస్థితి ఏంటో.

సరే, ఇక విషయానికి వస్తే, ఫారిన్ లో లైఫ్ అంటే ఏంటో అనుకుంటాం కానీ, బొత్తిగా నిస్సారమైన బతుకులాగుంది. వీక్‌డే లో బతుకు అంతా పొద్దున లేచి సద్ది సర్దుకుని స్నానం చేసి ఆఫీసుకెళ్లడం, పని చేస్తూ చేస్తూ మధ్యలో ఆ సద్ది లాగించేసి మళ్లీ పని చేసీ చేసీ ఇంటికి రావడం, ఇంత వండుకుతిని మళ్లీ పొద్దున్నే లేచి ఆఫీసుకెళ్లాలి అని తిట్టుకుంటూ నిద్ర పోవడం. అంటే వీకెండులో జీవితం ఏదో నక్క తోక తొక్కిందా అంటే అదీ లేదు. ఏదైన ప్లేసు చూడటానికి పోతే అక్కడ తిందామంటే పిజ్జాలు బర్గర్లు తప్ప ఇంకేమీ దొరకదు. వాటికి వీళ్ల పేర్లు కూడా వింతగా పెడతారు. మావాడు ఒకడు వచ్చిన కొత్తలో పెప్పరోనీ అంటే పెప్పర్ ఆండ్ ఆనియన్ మిక్ష్చర్ అనుకున్నాట్ట. రెండు మూడు సార్లు తిన్నాక ఎవడో చెప్పాడంటా అది బీఫ్ అని. దెబ్బకి వాడు బయటికి వెళ్తే మాంసం తీసుకోవడం మానేసాడు. ఎక్కడికెళ్లినా మీట్ లేకుండా మీదగ్గర ఏముంది అని అడగటం మొదలెట్టాడు.

బెంగళుర్‌లో వున్నప్పుడు ప్రతీ ఆదివారం రాత్రి పక్కనే వున్న తిరుమల థియేటర్ కి వెళ్లేవాన్ని. అక్కడ ఏ సినిమా ఆడితే అది చూసి వచ్చేవాళ్లం. ఇక్కడ ఒక సినిమ చూడాలంటే ఎక్కడికో వెళ్లాలి. అది కూడా ఎదన్నా రెండు మూడు షోలుంటే నచ్చిన టైములో వెళ్లే ఆప్షన్ లేకుండా రోజుకు ఒక్క షో వేసి మూసేస్తున్నారు(తెలుగు అయితే). థియేటర్‌లో స్క్రీను, సౌండ్ ఎఫెక్ట్సు మాత్రం మన తిరుమల లోనే చాలా బెటర్. అసలిదంతా ఎందుకొచ్చిందంటే, నిన్న బెంగళూర్‌లో వున్న ఒక ఫ్రెండుతో మాట్లాడుతూంటే అడిగాడు... ఇక్కడికీ, అక్కడికీ లైఫ్‌లో వున్న తేడా ఏంటి అని. ఆక్సిడెంటల్‌గా నా నోట్లోంచి ఒక అద్భుతమైన పోలిక వచ్చింది. అది అందరికీ చెబుదామని మొదలెట్టా.

ఇండియాలో ఇది బాలేదు, అది బాలేదు అది తిట్టుకుంటూ, ఫ్రీడం లేదని బాధ పడుతూనే మనకు నచ్చినట్టుగా వుంటాం. ఇక్కడైతే ఇన్‌ఫ్రాస్ట్రక్చరూ, ఫెసిలిటీసు అన్నీ బాగున్నాయని మెచ్చుకుంటూ, ఫ్రీడం వుందని చంకలు గుద్దుకుంటూ ఎవడో రాసిన రూలు బుక్సుని ఫాలో అవుతూ బతికేస్తున్నాం.

ఇక్కడ ఇంకో విషయమేమిటంటే ఇక్కడ మనకు నచ్చిన కొన్ని విషయాలు ఇక్కడివాళ్లకు నచ్చకపోవడం. టొరొంటోలో అండర్‌గ్రౌండ్ ట్రాన్సిట్ వుంది. మొదటిసారి చూసినప్పుడు అది నాకు చాలా బాగా అనిపించింది. ఎంత బాగా చేసారో కదా అని పక్కవానితో అన్నా కూడా. రెండు వారాల్లో ఇక్కడ మేయర్ ఎలక్షన్స్ వున్నాయి. ఆ ఎలక్షన్స్ గురించి పేపర్లల్లో వచ్చే ఆర్టికల్సు, ఇక్కడివాల్లతో డిస్కషన్సూ అన్నీ కలిపితే నాకు అర్థం అయ్యిందేమిటంటే మనం మన సిస్టం మీద ఎలా అసంతృప్తితో వున్నామో అలాగే వీళ్లు కూడా వీళ్ల సిస్టం మీద అసంతృప్తితో వున్నారు. సబ్‌వే సిస్టం లో వీళ్లకు లోపాలు కనిపిస్తున్నాయి. వాటిని క్లియర్ చేసేవానికి వోటేస్తారంట. ఈరోజు మధ్యాహ్నం ఒక ఫ్రెండ్ అడిగాడు... ఇక్కడికొచ్చిన రెండు నెలల్లో ఏమేమి తెలుసుకున్నావురా అని... నేను తెలుసుకున్నది మాత్రం ఒక్కటే. అది - పక్కింటి పుల్లకూరకి రుచెక్కువ. మనకి వీళ్లది నచ్చింది, వీళ్లకి ఇంకేవరిదో నచ్చింది, వాళ్లకి ఇంకొకరిది.

23 సెప్టెంబర్, 2010

నలుని వంట... భీముని తంట...!?!?!?!

అది అనగా అనగా, అంటే కొన్ని సంవత్సరాల క్రితం మాట అన్నమాట. మేము ఫ్రెండ్స్ అందరం ఉద్యోగప్రయత్నాల్లోంచి బ్రహ్మిగా రూపాంతరం చెందిన కొన్ని రోజులకి, అందరం కలిసి ఈ సింగిల్ రూముల్లో బతుకు వెళ్లదీయడం దేనికిలే అని ఒక ఫ్లాట్ అద్దెకి తీసుకుని అక్కడికి మారాం.

మామూలుగానే స్వతహాగా అన్ని బ్యాచిలర్ బ్యాచులకి వుండే అత్యుత్సాహం కొద్దీ కొత్త ఫ్లాట్‌లోకి అడుగుపెట్టే ఒకటి రెండు రోజులముందు అనుకున్నాం. కొత్త ఫ్లాట్‌లో అయినా ఈ మెస్సు ఫుడ్డు మానేసి రోజూ రాత్రి వంట వండుకుందాం. వీలయితే మధ్యాహ్నం బాక్సులు తీసుకెళ్దాం. ఓపిక వుంటే పొద్దున టిఫిన్ చేసుకుందాం. ఇక నుంచి బయట ఫుడ్డు కోసం పైసా కూడా ఖర్చుపెట్టకూడదు అని సవాలక్ష ప్లాన్లు వేసాం. మామూలుగా అయితే ఇది ఎక్కువ కాలం జరగాల్సిన ప్రక్రియ కాదుగానీ, మావాల్ల ఉత్సాహ ప్రదర్షన మూలంగా కొంచం, బయటి ఫుడ్డుమీద ఇంట్రెస్టు పోవడం మూలంగా కొంచెం ఆ అలవాటు అలా సా...గి పోయింది, కొన్ని సంవత్సరాలపాటు. అదిగో అప్పుడు మొదలైంది నాకు ఇంట్లో సుప్రభాతం... వంట నేర్చుకొమ్మని. వారానికొకసారైనా వంట నేర్చుకోరా అని చెప్పకుండా ఫోన్ పెట్టేసేది కాదు. కానీ, మా రూమ్మేట్సు మాత్రం చాలా మంచోల్లు. నన్ను కొన్నేళ్లుగా చూసిన అనుభవం వల్ల నాన్ను ఏనాడు వంట నేర్చుకొమ్మని చెప్పలేదు సరికదా, నేను కిచెన్‌లోకి పోతుంటేనే భయపడిపోయి నాకు ఏంకావాలో అడిగి అది చేసిచ్చేవాళ్లు. హైటు తగ్గిన భీమునిలా వుండే నేను నలుని వంటను మించిన రుచికరమైన వంట (టైటిల్ జస్టిఫికేషన్) చేద్దామన్న కల అలాగే మిగిలింది. అలా జీవితం స్వర్గంలా గడిచింది ఒక 3 సంవత్సరాలు.

ఈలోపున ఒక్కొక్కరికి పెళ్లిల్లు అవడం, ఒక్కొక్కడుగా ఫామిలీ పెట్టుకోవడం జరిగిపోయింది. చివర్లో ఒకడు అదే ఫ్లాట్‌లో ఫామిల్య్ పెట్టుకోవడం, నాతో పాటు మిగిలిన పెళ్లి కాని ప్రసాదు అమెరికాకి ఆన్సైటు రావడం వల్ల నేను వేరే కొందరు ఫ్రెండ్స్ వున్న రూములోకి షిఫ్ట్ అయ్యా. పాపం, అమ్మకి అప్పటికీ నేను వంట నేర్చుకుంటానన్న ఆస చావక అడిగింది... ఏరా, ఈ రూములో కూడా వండుకుంటారా...? అని. బ్రహ్మాండంగా అని నా సమాధానం విని తెగ సంబరపడిపోయి కనీసం ఇక్కడైనా వంట నేర్చుకోరా అని బతిమాలింది. కానీ ఏం లాభం... ఇక్కడి రూమ్మేట్సు మనం ఆఫీసునుంచి వచ్చేసరికి వండేసి, మందేస్తూ మనకోసం ఎదురు చూస్తూ వుండేవాళ్లు. అలా మనకి ఎక్కడికి వెళ్లినా తినిపెట్టే అద్రుష్టం, మిగిలిన వాళ్లకి వండిపెట్టే మహాభాగ్యం కలిగాయన్నమాట.

పాపం, అమ్మ మాత్రం మీ ఫ్రెండ్సు దగ్గర నేర్చుకోరా... ఏనాటికైనా పనికొస్తుంది అని చాలారకాలుగా చెప్పిచూసింది. ఒకట్రెందు సార్లు ఇంట్లో పాకశాస్త్రం మీద క్లాసులు తీసుకోవాలని కూడా ప్రయత్నించింది కానీ పెళ్లి బూచి చూపి తప్పించుకున్నా.

అలా జీవితం ముప్పూటలా పక్కనవాడు వండింది తుంటూ సాగదీస్తున్న రోజుల్లో మార్గదర్శిలో చేరకుండానే ఒక ఆన్సైటు దొరికింది. ఈవిషయంలో అందరికంటే ఎక్కువగా సంతోషపడింది మా అమ్మ. అదికూడా నేను విదేశాలకు పోతున్నాననేకంటే, ఇప్పుడూ ఎలాగైనా తప్పదు కాబట్టి అక్కడ వంట నేర్చుకుంటాడు అని. కానీ మా అమ్మొకటి తలిస్తే విధి ఇంకోటి తలచింది. ఇక్కడికొచ్చి చూస్తే, సాటి హైదరబాదీయుడు, నా బెంగళూరు రూమ్మేట్సుకంటే మంచోడు. కిచెన్‌లో నేను చేయగలిగిన ఏకైక కార్యక్రమం కుక్కర్‌లో బియ్యం పెట్టడం. నేను అది చేసినా కూడా "పర్లేదు, నేను పెట్టేస్తా, నువ్వెళ్లి కూర్చో" అని చెప్పిన సహృదయుడు.

ఈ విషయం మా అమ్మకు తెలిసి నాకు వంట చేసే భాగ్యం ప్రసాదించమని కనిపించన ప్రతీ రాయికీ మొక్కేసి, కనిపించిన ప్రతీ గుళ్లోకీ వెళ్లి ప్రత్యేక పూజలు కూడా చేయించింది. ఏ గుళ్లో ఏ దేవుని డెసిషనో తెలీదు కానీ, ఇక్కడ మా రూమ్మేటుకి పని పెరగడం స్టార్ట్ అయ్యింది. వరుసగా వారం రోజులపాటు ఇద్దరం పచ్చడి మెతుకులతో ముప్పూటలా ముగించేసాం. ఇలా ఎంతకాలం అని ఒక చిన్న ఆత్మశోధన చేసుకుని, ఒకరోజు నేను వంట చెయ్యాలని డిసైడ్ అయ్యా.

ఆఫీసులోనే అందుకు తగ్గ కసరత్తు మొదలెట్టేసి, యూట్యూబు లో ఆలుగడ్డ కూర మీద ఒక వీడియో చూసి, ఇంకో రెండు సైట్లల్లో ఎలా చెయ్యాలో చదివేసి రూముకి బయలుదేరా. దార్లో మా ఉమాని కూడా అడిగా, ఎలా చేయ్యాలి అని. తను కూడా ఓంట్లో వున్న ఓపికనంతా తెచ్చేసుకుని కూర ఎంతసేపు చెయ్యాలో అంతసేపు విసుగుతెచ్చుకోకుండా ఎక్ష్‌ప్లెయిన్ చేసాడు.

ఇంటికెళ్లాక కాస్త ఫ్రెష్ అయ్యి, కిచెన్‌లోకి అడుగుపెట్టా. కదనరంగంలో కాలు పెట్టిన కొత్త సైనికుడిలా నా గుండె వేగంగా కొట్టుకోసాగింది. అరగంట కష్టపడి ఆలుగడ్డా, ఉల్లిగడ్డ కోసేసి, పచ్చిమిరపకాయలు కోయబోతూ కారంతో సరిపెడదామని డిసైడ్ అయ్యా. ఆ తరువాత ఏం చెయ్యాలా అని చాలాసేపు ఆలోచించా. ఏదో మరిచిపోతున్నా అని తట్టింది కానీ ఏం మరిచిపోయానో తట్టలేదు. ఇలా కాదులే అని మా ప్రదీప్ కి ఒక ఫోన్ కొట్టా. మనవాడు, ఆలుగడ్డ ఫ్రై గావాల్నా, గ్రేవీ గావాల్నా, కర్రీ గావాల్నా అని వెంకీ సినిమాలో కృష్ణ భగవాన్ లాగా చాలా ఆఫర్స్ ఇచ్చాడు. ఏదో ఒకటి అని కర్రీ దగ్గర డిసైడ్ అయ్యాక అది వుందా, ఇది వుందా అని చాలా వాటికి నాతోనే లేవనిపించి ఎర్ర ఫ్లైటెక్కి వంటచేయడనికొచ్చానని చిన్న కామెంటేసి వున్నవాటితో ఎలా వండాలో చెప్పాడు. ఏదో మరిచిపోతున్నా, మరిచిపోతున్నా అని అనుకుంటూ అన్నీ తను చెప్పింట్టే చేసేసి... కూర అయిందనిపించా.

హమ్మయ్య... నేను కూడా వంట నేర్చుకున్నా అని ఆనందించి వెంటనే ఆ ఆనందాన్ని ఒక పోస్టు ద్వారా అందరితో పంచుకుందామని, ఇన్స్పిరేషన్ కోసం తోటరాముడు ఓపెన్ చేసి 32వ సారి మగ పిల్లాడు - పిల్ల మగాడు పోస్టుని చదివేసి, 34వ సారి వివాహ భోజనంబు - వింతైన వంటకంబు పోస్టుని చదువుతుంటే మా రూమ్మేటు వచ్చాడు. టేస్టు చూసి ఎలా వుందో చెప్పమన్నా. రమణ గోగుల, అను మలిక్ కలిసి పాడిన పాటకు కృష్ణ, రాజశేఖర్ కలిసి డాన్సు చేస్తే ఎలా వుంటుందో లైవ్ చూపిస్తాడనుకున్నా కానీ, నా అంచనాలను మారుస్తూ "నువ్వొస్తానంటే నేనొద్దంటానా"లో ఉప్పుతో చేసిన హల్వా తిన్న జయప్రకాష్ రెడ్డి లాగా ఫేస్ పెట్టి "మళ్లీ కిచెన్‌లో అడుగు పెడితే కాల్లు విరగ్గొడతానని" డిప్లొమాటిక్‌గా వార్నింగ్ ఇచ్చేసాడు.

23 ఆగస్టు, 2010

ఎట్టకేలకు.... మొదటి ప్రయాణం

బెంగళూరులో కూర్చొని బుద్దిగా నా పనేదో నేను చేసుకుంటూ, మధ్య మధ్యలో బ్లాగులు చదువుతూ, మూడొచ్చినప్పుడు బ్లాగులు రాసుకుంటూ నామానాన నేను బతుకుతుంటే... ఒకరోజు సడెన్‌గా నా మేనేజర్ పిలిచి నీకు కెనడా వెళ్లడానికి ఏమైనా ప్రాబ్లెమా అని అడిగాడు. వెంటనే నా కల్లముందు ఒక పెద్ద రింగు తిరిగి గతంలోకి వెళ్లిపోయా.

ఇంజినీరింగ్ అయ్యాక, ఉద్యోగ ప్రయత్నాల్లో వున్నప్పటినుంచీ నువ్వు ఫారిన్ వేళ్తే చూడాలిరా అని అన్న అమ్మ, బ్రహ్మిగా కెరీర్ మొదలెట్టిన రోజునుంచీ నువ్వు శ్రీలంకకైనా సరే ఒక్క వారం వెళ్లిరారా, అమెరికాలో వున్నావని ఊర్లో మూడ్నెల్లు చెప్పుకుంటా అని కలిసినప్పుడల్లా చెప్తున్న బాబాయి కంటిముందు కనిపించారు. నేనోదో ఆలోచిస్తున్నా అనుకున్న నా మేనేజరు నీకెమైనా ప్రాబ్లెం వుంటే చెప్పు... వేరేవాళ్లకి ట్రైనింగ్ ఇచ్చి పంపిద్దాం అన్నాడు. నా ఆలోచనని మరోరకంగా అర్థం చేసుకున్నాడని అర్థం అయిన మరుక్షణం స్టైలు మార్చి విక్టరీ బాబు లెవెల్లో "సార్, కెనడా అంటే చాలా ఇష్టం సార్, ఆన్సైటు మీద అక్కడికి పంపుతారనే నేను ఈ కంపనీలో చేరా సార్... అసలు నేను పుట్టిందే కెనడాలో పని చేయడానికి సార్" అని కొంచెం అతి చేసా. పాపం, అప్పటికప్పుడు నన్నో వీరవిధేయునిగా మార్క్ చేసుకుని ఈ వీకెండ్లో నీ ప్రయాణం అని ఓ అభయహస్తం పడేసాడు. రాక రాక కెరీర్ మొదలైన ఇన్ని రోజులకి నాకో ఆన్సైట్ వచ్చిందని, ఒక మూడు నాలుగు పార్టీలు చేసుకుని... బెంగళూరు కి టాటా చెప్పేసి టొరొంటో కి విమానమెక్కా. ఆకాడికి కెనడాలో దుమ్మేద్దాం, ఇరగదీసేద్దాం అని ఏదేదో ప్లానులేసుకున్నా కూడా. అనుకున్నదే ఆలస్యం, "అనుకున్నామని జరగవు అన్నీ, అనుకోలేదని ఆగవు కొన్నీ" అనే పాట గుర్తొచ్చింది.

అది గుర్తుకు రావడం కాదనీ, సిక్స్త్ సెన్స్ ఇచ్చిన వార్నింగనీ, దూరపు కొండలు నునుపనీ, సూర్యుడు తూర్పునే ఉదయిస్తాడనీ కొన్ని కఠోర నిజాలు ఫ్లైట్ ఎక్కాక తెలిసొచ్చాయి. అప్పటివరకూ ఆన్సైటు విశేషాలగురించి ఎవరైనా చెప్తే వినడమే కానీ చూసిన అనుభవం లేదాయె. ఇంటర్నేషనల్ విమానాల్లో అడిగినంత మందు పోస్తారంటే చెవులు రిక్కించి విని గుడ్లప్పగించి చూసిన నాకు, బొంబాయిలో ఏయిర్ ఇండియా ఫ్లైట్ ఎక్కగానే పెద్ద షాక్ ఇచ్చింది. ఫ్లైట్ ఎక్కగానే ఎదురొచ్చిన ఒక నలభయ్యేల్ల ఎయిర్ హోస్టెస్ ఫ్లైట్ ఎగరగానే డిన్నర్ తెచ్చి ఇచ్చింది. ఇచ్చింది ఇచ్చినట్టు పోకుండా ఇంకా ఎమైనా కావాలా సార్ అంది. ఒక పెగ్గు వోడ్కా అంటె, సారీ సర్, ఫాంటా వుంది అంది. అదివద్దు కానీ ఒక పెగ్గు విస్కీ అంటే, సారీ సర్, స్ప్రైట్ వుంది అంది. కలుపుకునేవి కావమ్మా, తాగేవి కావాలి అంటే, మంచినీళ్లు వున్నాయి సర్ అంది. దూరపు కొండలు నునుపే కాదు, ముదురు కూడా అని అప్పుడు అర్థం అయ్యింది.

మన అదృష్టం ఎప్పుడు సరిగా ఏడ్చింది కనుక ఈరోజు బాలేదనుకోడానికి అని ఒక చిన్న నిట్టూర్పు నటించేసి ఎదురుగా వున్న హెడ్‌ఫోన్ తీసి చెవిలో పెట్టుకున్నా. డిన్నర్ - సినిమా - నిద్ర - సినిమా - బ్రేక్‌ఫాస్ట్ - సినిమా... ఇలా బతుకు వెళ్లదీస్తుండగా లండన్ వచ్చేసింది. ఇది వూర్లల్లో చెంబట్టుకుని పోయే లండన్ కాదండోయ్... నిఝం లండన్. పేర్లు పెద్దగా గుర్తు లేవుకానీ, సిటీ మధ్యలోంచి వెళ్తున్న నది పై కట్టిన ఒక హిస్టోరికల్ బ్రిడ్జిని కిటికీలోంచి చూసా. దాని పేరు టవర్ బ్రిడ్జ్ అనుకుంటా. అక్కడ దిగినతర్వాత నాకు ఏడు గంటల ట్రాన్సిట్. విసా ఆన్ అరైవల్ లాంటిదేమైనా ఇస్తారేమో అని ఆశగా ఎయిర్ ఇండియా కౌంటర్ కి వెళ్లి అడిగితే, అది ఇది అంటూ పెద్ద ప్రాసెస్ చెప్పి, ట్రై చేస్తే ఇక్కడినుంచి సిటిని కనెక్ట్ చేసే సూపర్‌ఫాస్ట్ రైల్లో వెళ్లి అదే రైళ్లో వెనక్కి రావచ్చని చెప్పింది. "ఈసారికి వద్దులే, వచ్చేసారికి ఆన్సైటు యూరప్‌కి ట్రై చేద్దాం" అనుకుని ఏయిర్‌పోర్ట్‌లో అంతసేపు ఏం చెయ్యాలా అని ఆలోచనలో పడ్డా. కాస్త ఫ్రెషప్ అయ్యి రెండు బ్రెడ్డుముక్కలు తిని కాఫీ తాగిటెర్మినల్ మొత్తం కాసేపు చుట్టొద్దామని నడవడం మొదలుపెట్టా. చిన్నదేం కాదు, ఆ ఒక్క టెర్మినల్ చుట్టడానికే నాకు రెండు గంటలు పట్టింది... ఎంత పెద్ద ఏర్‌పోర్టో...!!!

అటు ఇటు తిరిగీ బోరు కొట్టింది కానీ టైం గడవట్లేదు. ఏం చెయ్యాలో అర్థం కాక మళ్లీ తిన్నా. లండన్‌లో వుండే ఒక ఫ్రెండుకి ఫోన్ చేద్దామంటే లైన్ కలిసి చావలేదు. ఇన్ని కష్టాల మధ్య నాకు ఊరటనివ్వడానికి ఒక అమెరికన్ సైనికుడు తగిలాడు. ఇరాక్‌లో కొంతకాలం పనిచేసి సెలవులకోసం ఇంటికి పోతున్నాడు. మామూలుగా మాట్లాడుతూ మాట్లాడుతూ డిస్కషన్ పాకిస్తాన్ టెర్రరిజం వైపు మళ్లింది. భలే మంచి టాపిక్ అని ఇద్దరం ఎవరి చంకలు వాళ్లం గుద్దుకొని వెళ్లి ఒక బార్ కౌంటర్ దగ్గర కూర్చొని డిస్కషన్ కంటిన్యూ చేసాం. అక్కడినుంచి మాటలు మతం వైపు వెళ్లాయి. అన్ని మతాలగురించి మాట్లాడెసుకుని చివరగా హిందు మతం గురించి అడిగాడు. అప్పట్లో ఒక ఫార్వార్డెడ్ మెయిల్లో చదివిన కంటెంటూ, రీసెంటుగా వార్త పేపర్‌లో చదివిన ఒక ఆర్టికలూ కలిపి కొట్టి, హిందూత్వ అంటే ఒక మతం కాదనీ, ఒక నమ్మకమనీ... వేర్వేరు సిద్దాంతాలు వున్నవాళ్లందరినీ కలిపి వుంచే నమ్మకమే హిందూమతమని ఇంకా ఇంకా చాలా చెప్పెసా. హిందువులు చేసే దైవారాధనలకు రోమన్లు చేసే దైవారాధనలకు దగ్గరి పోలికలు వున్నాయని ఎదో ఆర్టికల్‌లో చదివిన విషయాన్ని నా సొంత పరిశోధన లెవెల్లో ఎక్స్‌ప్లెయిన్ చేసా. పాపం... వెర్రోడు ఇదంత నా సొంత తెలివి అని నమ్మి నా మెయిల్ ఐడి తీస్కొని, ఇంటికి చేరగానే మెయిల్ చేసి, ఇప్పుడు కాల్ కూడా చేస్తున్నాడు. ఏదైతేనేమి... ఒక ఫ్రెండు దొరికాడు. సమాచార సాంకేతిక విప్లవంవల్ల ఒక కుగ్రామంగా మారిన ఈ సువిశాల ప్రపంచంలో నాకు ఒక ఖండాంతర స్నేహితుడున్నాడిప్పుడు. మా ఇద్దరి ఫ్లైట్‌లకీ మధ్య తేడా ఒక్క అరగంట మాత్రమే వుండడం వల్ల అతనెళ్లాక నాకు పెద్దగా బోర్ అనిపించలేదు. చివరాఖరికి వచ్చి నా చివరి మజిలీకి విమానమెక్కా. అది కూడా ఏయిర్ ఇండియా ఫ్లైటే. అదేంటో, ఈ ఫ్లైట్‌లో కూడా మందు లేదన్నారు. :'(

"ఇంకేం చేస్తాం.... ఖండించేస్తాం" అని పాడుకుంటూ "లంచు - నిద్ర - సినిమ - నిద్ర - స్నాక్సు - నిద్ర" ఇలా సా.......సాగిస్తున్నంతలో టొరొంటో వచ్చేసింది. కిటికీలోంచి చూస్తుంటేనే అర్థం అయిపోయింది, పెద్ద సిటీనే. ఏదయితేనేం, ఎలాగయితేనేం... చివరాఖరికి నేను కూడా ఆన్సైటుకొచ్చేసా. పులి పులివెందులలో దిగింది. పులివెందుల విశేషాలు వచ్చే టపాలో.

05 జులై, 2010

కొన్ని సరదా కబుర్లు - 1

నేను, మా రాజేష్ గాడు ఇంజినీరింగ్ ఫస్ట్ ఇయర్ నుంచీ రూమ్మేట్స్‌మి. మా రూం మేమున్న కాలనీలో ఒక మూలకి వుండేది. మేమందరం తినే మెస్సు సరిగ్గా అవతలి మూలకి వుండేది. మేము మెస్స్‌కి వెళ్లాలి అంటే మధ్యలో అన్ని రూములూ టచ్ చేసే ఒక సౌలభ్యం వుండేదన్నమాట. కాకపోతే అందరికీ రెండు అడ్డాలు వుండేవి. ఒకటి, మా రూముకి, మెస్సుకి మధ్యలో వుండే మా సూరీడు రూము. వాడి గురించి తెలియాలంటే ఇక్కడ చదవొచ్చు. రెండోది, బావబామ్మర్దుల రూము. (మా మిట్టి గాడు, సంతోష్ గాడూ ఇద్దరూ మైసూర్లో రూమ్మేట్సు. హైదరాబాద్ వస్తే బావబామ్మర్దులు. అందుకే ఆ రూంకి ఆ పేరు.) ఎవరి సౌకర్యం ప్రకారం వాళ్లు మెస్స్ టైముకి ఏదో ఒకచోటికి చేరేవాళ్లు. సూరీడు రూముకి చేరినవాళ్లు మెస్సుకి పోతూ పోతూ బావాబామ్మర్దుల రూములో వాళ్లని పోగేసుకుని పోగేసుకుని మెస్సుకి చేరేవాళ్లు. అలా అందరం కలిసి ఒకేసారి తినేవాళ్లం అన్నమాట.

ఒకసారి భొజనాల వేళకి నేను, మా రాజేష్ గాడు సూరీడు రూముకి చేరాం. అక్కడ అల్రెడీ మా కిరన్ గాడూ, సజోగ్ గాడు వున్నారు. సజోగ్ గాని సొంత ఊరు కేరళ. శురీడు రూముకి, మెస్సుకి మధ్య వాడి రూం వుండడం వల్ల, వానికి మా వాళ్ల లాగానే క్రికెట్ ఆడాలనే పిచ్చి వుండడం వల్ల, ఇంకా ఇతరత్రా చాలా కారణాల వల్ల వాడు మాతో ఎక్కువగా వుండేవాడు. మేము నలుగురం రూంలోపల కూర్చుని ఏదో మాట్లాడుకుంటున్నాం. బయట మిగిలినవాళ్లు కూడా ఎదో సొల్లు వేసుకుంటున్నారు. ఇంతలో మామధ్య టాపిక్ కేరళ సినిమాలవైపు వెళ్లింది. ఇక్కడ ఇంకొక విషయం చెప్పుకోవాలి. మా రాజెష్ గాడు, కిరన్ గాడు క్లాస్‌మేట్స్. వాళ్లకి సుబి అని ఒక కేరళ క్లాస్మేట్ వుండేవాడు. మా కెరళ సినిమాల టాపిక్‌లో రాజేష్ గానికి ఎప్పుడో ఎదో సందర్భంలో ఆ సుబి గాడు చెప్పిన మాట అన్నడు. అది - "కేరళలో కొన్ని ఏరియాల్లో షకీలా సినిమాలకి ఇంట్లో వున్న మగాళ్లందరూ కలిసి వెళతారు" అని. అంటె, తండ్రీ కొడుకులు, అన్నాతమ్ములూ అలాగంట. వాడు ఆ విషయం పూర్తిగా ఎక్స్‌ప్లెయిన్ చెయ్యగానే, స్వతహాగ నాకున్న ఉత్సాహం, ఆవేశం చంపుకోలేక వున్నపళంగా సజోగ్ గాని వైపు తిరిగి "క్యారే సజోగ్, తుం ఔర్ తుమారే పాపా భి ఐసే జాతే క్యా?" అని అడిగేసా. (అంటే తెలుగులో, నువ్వు, మీ నాన్న కలిసి అలాంటి సినిమాలకు వెళతారా అని). పాపం వానికి ఎమనాలో అర్థం కాలేదు. అర నిమిషం పాటు వానికే కాదు, పక్కనున్న ఇద్దరికీ కూడా అర్థం కాలేదు, నా ప్రశ్నకి ఎలా రియాక్ట్ కావాలో. నేనేమో సీరియస్‌గా ప్రశ్నేసి వాడి ఆన్సర్ కోసం వాని వైపే చూస్తున్నా. వాడు ఒక నిమిషం తర్వాత షాక్ నుంచి తేరుకుని "పోరా, అడగడానికి ఇంకేమి దొరకలేదా... ఆకలేస్తోంది, మెస్సుకెళ్దాం పదా" అని హిందీలో చెప్పి బయటికి నడిచాడు. వాని వెనకే మేము కూడా. అప్పట్లో నేనెంత అమాయకంగా వుండెవాన్నంటే, ఆ క్వెశ్చన్‌లో ఎలాంటి మీనింగ్ వుంది అన్నది, రాత్రికి మా రాజేష్ గాడు చెప్పేవరకు అర్థం కాలేదు.

ఇది జరిగిన కొన్ని రోజులకే... పరీక్షల వేళ. ఒకరోజు డిన్నర్ తర్వాత, మర్నాడు ఎవరికి ఎగ్జాం లేకపోవడంతో అందరం కలిసి బావాబామ్మర్దుల రూములో కూర్చుని, పడుకొని, వాలిపోయి.... అలా ఎవరికి నచ్చిన పొసిషన్ ఆండ్ ఆంగిల్లో సెటిల్ అయిపోయి సొల్లేసుకుంటున్నాం. తొందరలో ఇంటికి వెళ్లాలి కాబట్టి ఎవరెవరు ఎలా వెళ్దాం అని అక్కడ డిస్కషన్ పాయింట్. మా రాజేషు గాడికి బతుకంతా బస్సు ప్రయాణాలతో గడిచిపోయింది. దాంతో వాడు ఎప్పుడు బెంగుళూర్ దాకా ట్రెయిన్‌లో వెళ్లడానికే ఇష్టపడేవాడు. ఆరోజు డిస్కషన్‌లో కూడా వాడు ట్రెయిన్‌లో పోవాలని అన్నాడూ, ఆస్ యూసువల్‌గా. కాకపోతే అందరం బయలుదేరదామనుకున్నరోజు ఒకరిద్దరికి పొద్దున ఒక పరీక్ష వున్నందువల్లనూ, వాళ్లిద్దరూ హైదరాబాద్ వాళ్లవడం వల్ల, హైదరాబాద్ వెళ్లేవాల్లందరం రెండు గంటల బస్సుకి బయలుదేరాలి అనుకున్నాం. మిగిలినవాళ్లందరూ ట్రెయిన్‌లో వెళ్లాలని ప్లన్ చేసారు. అసలు ఎలా వేళ్లినా మళ్లీ అందరం మజెస్టిక్‌లో కలుసుకోవాల్సినవాళ్లమే. ఎందుకంటే, అందరికీ అక్కడినుంచే వాళ్ల వాళ్ల వూరికి బస్సో, ట్రెయినో పట్టుకునేవారు. ఏరకంగా చూసినా, అప్పట్లో హైదరాబాదుకే ముందు బయలుదేరేవి.

ఈ ప్లాన్ అంతా ముగిసాక, యే ట్రెయినుకు వెళ్లాలి? బెంగళూరు చేరాక రాత్రి బస్సు టైము వరకు ఏమి చేయాలి అని మొదలైంది. అంతా కలిసి టిపు ఎక్స్‌ప్రెస్‌కి బయలుదేరి వెళ్లాలి అనుకున్నారు. మొదట్లో అది 11.20 కి మైసూరులో బయలుదేరి 2.40 కి బెంగళూరుకి వచ్చేది. ఈ డిస్కషన్ జరగడానికి కొన్ని రోజులముందే ఇండియన్ రైల్వేస్ వారు టైంటేబుల్ మార్చారని పేపర్లో చదివా. నాకేమో పేపర్ పట్టుకుంటే ఒక గంటపాటు దాన్నిఆసాంతం చదివే అలవాటు. మా వాళ్లకి ఇంగ్లిష్ పేపర్ ఇస్తే ఫస్ట్ పేజీ, స్పోర్ట్‌పేజీ తప్ప వేరే ఏ పేజీలకు వెళ్లే ఓపిక లేదు. సరిగ్గా అదే ఆలోచించి, మనవాళ్లకి విషయం తెలుసో లేదో అని అందరినీ ఉద్దేశిస్తూ చెప్పా - "టిపు ఎక్స్‌ప్రెస్ టైము మారిందిరా. ఇప్పుడది 11కే బయలుదేరుతుందీ" అని. అప్పటివరకూ సైలెంటుగా వున్న బక్క రవిగాడు ఒక్కసారిగా లేచి నీకిప్పుడు తెలుసా, మాకందరికీ ఎప్పుడో తెలుసు అని గట్టిగా అని నవ్వేసాడు. కానీ, నాకెందుకో అప్పటికి డౌటు వుండేది. వీళ్లకి త్యాఎలీదు అని. కానీ వాని మాటతో అందరూ ఒక్కసారిగా పెద్దపెట్టున నవ్వేసారు. నాకు కాలింది. సరెలే, పిల్లలు తర్వాత ప్రాబ్లెం ఫేస్ చెయ్యకూడదు అని చెప్తే నన్నే గేలి చేస్తారా అని అవేశంగా అడిగేద్దామని రెడీ అయ్యా. మెదడుకు ఆలోచనైతే వచ్చింది కానీ నోటికి ఆవేశం రాలేదు. ఆ క్షణానికి సైలెంటుగా కుమిలిపోయా.

ఇంకో వారం తిరిగేసరికి అందరం ఇంటికి వెళ్లాల్సిన రోజు రానే వచ్చింది. ఎలాగూ వెళ్లేది మధ్యాహ్నం బస్సుకు కదా అని కాస్త బద్దకంగానే వున్నా. నా రూమ్మేటైన రాజేష్ గాడు మాత్రం లేచి బ్యాగ్ సర్దుకుని రెడీ అవుతున్నాడు. టైం చూస్తే ఇంక తొమ్మిది కూడా కాలేదు. అప్పట్లో మేమున్న కాలనీ నుంచి రైల్వే స్టేషన్ కి వెళ్లడానికి 20 నిమిషాలు పట్టేది. "ఎందుకురా అంత కంగారు, ఇంకా చాలాటైం వుంది కదా" అన్నా నేను వానితో. నేను రెడీ కావడం కాదురా, ఇంక మిగిలిన వాళ్లు రెడీ అయ్యారో లేదో చూడాలి. అందుకే రెడీ అయ్యి మనవాళ్ల రూములమీద పడితే అందరినీ టైముకల్లా రెడీ చేయొచ్చు అని చెప్పి భుజానికి బ్యాగ్ తగిలించుకుని బయలుదేరాడు. హ్యాప్పీ జర్నీ చెప్పి తలుపేసుకుని మళ్లీ ముసుగు తన్నేసా. పదింటప్పుడు ఎందుకో తెలివైంది. లేచి పేపర్ చదువుతూ రెడీ అవుతున్నా. రెడీ అవుతూ పేపర్ కూడా చదువుతున్నా. పదిన్నర దాటి పావుగంట అయ్యాక రాజేష్‌గాడు మళ్లీ వచ్చాడు. ఏరా అంటే "అందరూ ఇప్పుడే రెడీ అయ్యారురా. నేను జెర్కిన్ మరిచిపోయా, అది తీసుకెల్దామని వచ్చా"నన్నాడు. ఇంక స్టేషనుకెప్పుడెళ్తార్రా? అని ఆదిగితే ఇంకా అరగంట పైనే టైముంది కదరా, చేరిపోతాములే అన్నాడు. అప్పుడు నేను పేల్చా ఒక న్యూక్లియర్ బాంబ్. అంత టైమెక్కడుందిరా, ట్రెయిన్ 11కే జంపుజిలానీ కదా అని చెప్పా. పాపం, వానికి ఏం చెయ్యాలో, ఏం చెప్పాలో అర్థం కాలేదు.

వాడు షాక్‌నుంచి తేరుకోడానికి రెండు నిమిషాలు పట్టింది. ఆ తర్వాత మా ఇద్దరిమధ్యా చిన్న వాగ్యుద్దం కూడా నడిచింది. ట్రైన్ టైం మారింది అని తెలిసినప్పుడు ఎందుకు చెప్పలేదురా అని వాడు, మొన్న చెబితే తెలుసు అని చెప్పారు కదరా, మళ్లీ మళ్లీ ఎందుకు చెప్పాలిరా అని నేను. చివరికి అందరం కలిసి రెండు గంటల బస్సుకి బయలుదేరాం.

ఇప్పుడు చెప్పండి, ఇందులో నా తప్పేమైనా వుందా...? కానీ ఇప్పటికీ మా బ్యాచు వాళ్లు మాత్రం ఛాన్సు దొరికినప్పుడల్లా, ఇది గుర్తొచ్చినప్పుడల్లా ఆరోజు అందరూ నన్ను టీజ్ చేసిన దానికి ప్రతీకారంగా చివరినిమిషం వరకూ ఆగి అప్పుడు టైం టేబుల్ మారిందని చెప్పానని మళ్లీ మళ్లీ డిసైడ్ అయిపోతున్నారు. కనీసం నా వాదన వినిపించే చాన్సు కూడా ఇవ్వట్లేదు :'(

28 జూన్, 2010

మరో ఆక్సిడెంట్....!!!

అనగా అనగా 2008వ సంవత్సరం జూలై మాసంలో, మా ఆఫీసులో బ్యూటీ కాంటెస్ట్ గెలిచిన తెలుగమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నట్టు కల కంటూ నిద్రపోతున్న ఒకానొక ఉదయం నాన్న ఫోను చేసి నిద్ర లేపి "ఈ వేకెండ్లో ఇంటికి వచ్చి అఘోరించ"మని ఆర్డర్ పాస్ చేసాడు. సరే అని చెప్పి మళ్లీ ముసుగుతన్నా. నిద్ర లేచేసరికి అఫీసుకు టైమవుతోందనే ధ్యాసే తప్ప నాన్న ఫోన్ చేసిన విషయం అసలు గుర్తే లేదు. షరామామూలుగా ఆఫీసు టైముకి ఒక గంటలేటుగా చేరుకున్నా. పార్కింగ్ దగ్గర నాలాంటి బద్దక బ్రహ్మచారులు చాలామంది ఎదురయ్యారు. అందరం కలిసి లిఫ్ట్‌లో వుండగా ఒకడు అడిగాడు, ఈ వీకెండ్‌లో సినిమాకెళదామా అని . అప్పుడు గుర్తొచ్చింది పొద్దున ఫోనొచ్చిన విషయం. లేదురా, ఇంటికెళ్తున్నా అని చెప్పా. ఆఫీసుకెళ్లిన కాసేపటికే వాడు పింగ్ చేసి మన కంపనీలో కొత్తగా చేరిన పట్నం పోరడు గూడా ఇంటికొస్తుండంటా... ఇద్దరు కలిసి పొండ్రా అని చెప్పాడు. ఆ పట్నం పోరడు నా కోసం వెళ్లేప్పుడు గరీబ్ రథ్ కి తత్కాల్ టికెట్టు తీసాడు. తిరుగు ప్రయాణానికి మాత్రం ట్రెయిన్ టికెట్టు దొరకలేదు. నేను చాలా సార్లు వచ్చా, ధనుంజయ ట్రావెల్సు వాడి సర్వీసు బాగుంటుంది అంటూ అందులో టికెట్టు బుక్ చేసాడు. ఏసిలో చల్లగా పడుకొని క్షేమంగా ఇంటికి చేరాం.

తిరుగు ప్రయాణానికి బస్ టైముకి ఒక పావుగంట ముందు లక్డీకాపూల్ కి చేరుకున్నా. అప్పటికే నా కొలీగు నాకోసం వెయిటింగు. ఏంటి అంటే ధనుంజయ వాడి బస్సు పాడయిందని వేరే బస్సులో టికెట్టిచ్చాడు. వాడే టికెట్టిస్తూ ఆ ట్రావెల్సు ఆఫీసుకి దారి చెప్పాడు. అక్కడికి వెళ్లే సరికి బస్సు రెడీగా వుంది. దాహం వేస్తుంటే వెళ్లి వాటర్ బాటిలు కొందామనుకున్నా. కానీ ఎందుకో ఆ టైములో నా మట్టి బుర్ర పాదరసంలా పనిచేసింది. బస్సెక్కాక వాడు ఎలాగూ ఒకటిస్తాడు కదా అని ఆగిపొయ్యా. బస్సు బయలుదేరగానే బాటిలెప్పుడిస్తాడా అని ఎదురు చూస్తూ కూర్చున్నా. బస్సులో ఆస్తి పంపకాలు చేస్తున్నంత జాగ్రత్తగా సప్లై చేసుకుంటూ వస్తూంటే నా ప్రాణం లేచొచ్చినట్టయ్యింది. ఎలాగైతేనేం, నీళ్లు తాగేసా. ఇంతలో మళ్లీ ఆస్తి పంపకాలు మొదలయ్యాయి. చుస్తే వాడు చేతిలో ఒక కుర్కురే పాకెట్టు, ఒక గుడ్‌డే బిస్కెట్ పాకెట్టు పెట్టి వెళ్లిపోయాడు. అంతే, మనసులో "ధబ్"మని ఒక సౌండ్ వినిపించింది. యెస్... నేను వాడి సర్వీసుకి పడిపొయ్యా.

బస్సు దిగుతూనే బస్సు మీద పేరు చూసా. HKB టూర్స్ అని వుంది. మైండ్‌లో సెట్ అయిపోయింది. ఇక మొదలు... గత రెండు సంవత్సరాలుగా వాడిచ్చే చిప్స్ ప్యాకెట్టు, బిస్కెట్ ప్యాకెట్టులకు కక్కుర్తి పడి ఇంటికి వెళ్లిన ప్రతీసారీ అదే బస్సుకి రావడం మొదలుపెట్టా. ఎంతలా అంటే రిటర్న్ టికెట్ బుక్ చేయమని మా తమ్మునికి చెప్పిన ప్రతీసారీ వాడు దైరెక్టుగా ఆ ట్రావెల్సుకి పోయి బుక్ చేస్తాడు.

పోయిన వీకెండ్‌లో ఇంటికి వెళ్లేపుడు మా తమ్మునికి టికెట్ బుక్ చేయమని చెప్పినప్పుడు ఎందుకో ఎదో తేడా కొడుతున్నట్టనిపించింది. ఎప్పుడూ లేనిది, బస్సులో చిట్టచివరి సీటు దొరికింది. ఏవో కొన్ని అపశకునాల మధ్య బస్సెక్కా. తొమ్మిదింటి బస్సు తొమ్మిదిన్నర కి బయలుదేరింది. ఎప్పుడూ లేనిది ఇలా లేట్‌గా స్టార్ట్ అయినప్పుడు ఇంకేదో తేడా అనిపించింది. కానీ వాడు వేసిన రంగ్‌దే బసంతి సినిమా ఆ ఆలోచనలని దగ్గరికి రానివ్వలేదు. సినిమా అయిపోయాక కిటికీలోంచి పక్కకి చూస్తే, బస్సు జడ్చర్ల దాటింది. రోడ్డు సూపర్‌గా వుంది. బస్సు మూడంకెల స్పీడుతో పరుగెడుతోంది. ఆహా!!! చిన్న కుదుపు కూడా లేకుండా ప్రయాణం సుఖంగా వుంది. సింబాలిగ్గా "గాల్లో తేలినట్టుందే, గుండె పేలినట్టుందే, ఫుల్లు బాటిలెత్తి దించకుండా తాగినట్టుందే" అంటూ పాట వినిపిస్తోంటే నిద్రలోకి వెళ్లిపోయా. లేని అలవాటు.... మధ్యలో తెలివైంది. టైము చూద్దామనిఫోను తీస్తే స్విచ్చాఫ్ అయ్యింది. సరె అనుకొని మల్లి అలా నిద్రలోకి జారుకుంటున్నా. అంతలోనే పెద్ద కుదుపు... ఏమిజరిగిందో తెలిసేలోపల ఒక నాలుగైదు సార్లు ఎగిరి పైన లగ్గేజ్ షీల్డ్‌కి తగిలి కింద పడ్డా. సడ్డెన్‌గా బస్సు ఆగిపోయింది. రెండు నిమిషాలు సైలెంటుగా వున్నా. తల పైన అన్ని సార్లు తగలడంతో మైండ్ బ్లాకై, రెడ్డై, పింకై, బ్లూ అయి, మల్లీ నార్మల్‌కి వచ్చేసరికి రెండు నిమిషాలు పట్టింది మరి. ఆ రెండు నిమిషాలు గడిచాక విషయం అర్థం అయ్యింది.

వెంటనే నాలో ఆవేశం ఉప్పొంగింది... " దీంతల్లి... దేత్తడి పోచమ్మ గుడి... ఎవడ్రా ఆ డ్రైవర్‌గాడరోయ్...!!!" అంటూ అవేశంగా లేచా. లేచిన మరుక్షణం నా ఆవేశం చల్లారిపోయింది. ఎందుకంటే, మూడూ సీట్ల ముందు నిలుచున్నవాడు మసకగా కనిపించాడు... ఇంక డ్రైవర్ గాడేమి కనిపిస్తాడు నా బొంద. కానీ, అప్పటికే నాలో నిద్రపోతున్న మేధావి చటుక్కున లేచేసాడు. అతడు సినిమాలో ప్రకష్ రాజ్ లాగా ఇన్వెస్టిగేట్ చెయ్యడం మొదలుపెట్టాడు. అప్పుడు తెలిసింది... ఒకటి, నా కళ్లద్దాలు మిస్సింగ్. రెండు, నా ముందున్న సీట్లన్నీ నాకంటే ఒకమెట్టు కింద వుండాలి. కానీ అందరూ మూడూ సీట్ల ముందున్న వాడు మూడు మెట్ళ కిందున్నాట్టు కనిపించాడు... అంటే, బస్సు రోడ్డు మీడ లేదు. ( నా బొంద, బస్సు రోడ్డు మీద వుంటే, ఇన్ని కష్టాలు ఎందుకు??) మూడూ, రోడ్డు మీద పోతున్న వెహికిల్స్ అన్నీ మా కంటే ఎత్తులో వున్నాయి... అంటే, రోడ్డు పక్కన గుంతలో వున్నా. ఎవరికి వారు అద్దాలు పగలగొట్టాలని చూస్తున్నారు. కొందరు ఇంకా షాక్ నుంచి తేరుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. కుదుపులకి సీట్లల్లోంచి ఎగిరి కింద పడ్డవారు ఎక్కడెక్కడ దెబ్బలు తగిలాయో చూసుకుంటున్నారు. అసలెక్కడున్నామా అని చుట్టూ చూసా. కొంత దూరంలో రైలు వెళుతూ కనిపింది... అంటే పెనుగొండ దగ్గర్లో వున్నా అని అర్థం అయ్యింది. అంతసేపు, కిటికీలోంచి బయటకు పైకి చూసిన నేను ఒక్కసారిగా కిందకి చూసి షాక్ అయ్యా. పక్కనే పెద్ద కుంట. ఏ కొంచం తేడా జరిగినా బస్సు ఆ కుంట లో పడి మునిగేది. అంటే, బస్సులోంచి చూసినప్పుడు నాకు కుంట గురించి పెద్దగా తెలీలేదు... కాని పోలిసులొచ్చి బస్సు దించాక వాళ్లు ఎలా జరిగిందో ఇన్వెస్టిగేట్ చేసేప్పుడూ పక్క కుంట చూపించి చెప్పారు... అందులో పదుంటే బస్సు మునిగేది, ఎవరూ బతికేవారు కాదూ అని.

బెంగుళూరుకొచ్చాక అక్సిడెంటు గురించి మొత్తం మా రాజేష్ గాడికి చెప్పా. ఎలా జరిగింది, చుట్టు పక్కల పరిస్థితి.. అంతా చెప్పాక వాడన్నాడు, అంత మందిలో ఎవడో ఒక్కడు మంచి అదృష్టవంతుడు రా.. ఆ అదృష్టమే మిమ్మల్నందరినీ కాపాడిందీ అని. నాకు కూడా నిజమే అనిపించింది... ఆ అదృష్టవంతుడెవరో నాకు తెలీదు, కానీ ఆ బస్సే ఎక్కినందుకు, తెలిస్తే వెళ్లి ఒక పెద్ద థాంక్స్ చెప్పి ఫుల్ బాటిల్ మందు, అంచుకోడానికి తందూరి, డిన్నర్ కి బిర్యాని స్పాన్సర్ చేసేవాన్ని. కావాలంటే బెన్సన్ & హెడ్జెస్ సిగరెట్లు కూడా. ఆ అదృష్టవంతుడెవరో తెలిస్తే కాస్త చెప్పండీ ప్లీజ్.

04 జూన్, 2010

ఇల్లు కట్టనక్కర్లేదు... కష్టాలు తెలియడానికి!!!

ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు అన్నారంట పెద్దలు... వాళ్లెవరో నాకు తెలీదు. తెలిసుంటే, వాళ్లని నా తమ్మునికి అప్పజెప్పేవాన్ని. ఎందుకంటారా...

ఇల్లు కట్టడం, పెళ్లి చేయడం చాలా కష్టంతో కూడుకున్న పనులని పెద్దోళ్లు చెప్పిన సామెత అర్థం. కాని, కష్టం రుచి చూడడానికి ఇల్లు కట్టనక్కరలేదని, కట్టిన ఇల్లు కొన్నా చాలని ఈ నెల రోజుల జీవితం కొత్త పాఠం నేర్పింది. పొద్దున్నే కొత్త ఇంటిదగ్గరికి వెళ్లి పని ఎలా నడుస్తుందో చూడటం, పని వాళ్లకు ఏమేమి కావాలో అవన్నీ ఇప్పించటం, దగ్గరుండి చేయించటం, ఆఫీసుకి వెళ్లిరావటం, మళ్లీ రాత్రికి ఇంట్లో పని వాళ్లతో పని చేయించడం... గత నెలరోజులుగ ఇదే పని. అందుకే అన్నాను... ఇల్లు కట్టక్కర్లేదు... కొంటే చాలు. ఇంటీరియర్సు చేయించడానికే ఇంత కష్టమయితే, ఇంక ప్లాటు కొని, ఇల్లు కట్టించాలంటే... అమ్మో, మా తమ్ముడు నన్ను చంపేసేవాడు. ఎందుకంటే, పైన చెప్పిన పనులన్నీ నేను చూసా. వాడు చేసాడు, చేయించాడు. మనకున్న బద్దకానికి, సోమరితనానికి (ఈ రెండింటిలో ఎదో తేడా వున్నట్టు!!!) వాడు నెలలో చేయించినపని నేను చేయించాలంటే కనీసం ఒక త్రైమాసికం పట్టేది. సరె, పడితే పట్టింది కానీ, పనిలో క్వాలిటీ మాత్రం వాడిపనిలా వుండేదికాదు. చాలా తక్కువగా వుండేది.

ఎదైతేనేం, మొత్తానికి గృహప్రవేశం జరిగిపోయింది. దీనివల్ల నేను నేర్చుకున్న ఇంకొక పాఠం ఏమిటంటే, గృహప్రవేశం అనుకున్నంత వీజీ కాదు. అయినా, గృహప్రవేశాలకి తెల్లవారుఝాము ముహూర్తాలే ఎందుకు వస్తాయో... :'(

18 మే, 2010

అనుకోని యాత్ర - ఊటీ

మేము ఇంజినీరింగ్‌లో చేరాక, ఫస్ట్ సెమిస్టర్‌లోనే కొందరికి బండ్లు వచ్చాయి. సెకండ్ సెమిస్టర్‌కి వచ్చేసరికి బండ్లు పెరిగాయి. అదిగో, అప్పుడు అనుకున్నాం... అందరం కలిసి ఒకసారి బండ్లమీద ఊటీ వెళ్లి వద్దాం అని. అలా అనుకుంటూనే రోజులు గడిచిపోయాయి. రోజులు నెలలు, నెలలు ఏళ్లు అయ్యాయి. రెండేళ్లు గడిచాక, ఒక హోళీనాడు అందరం సరదాగా హోళీ ఆడుకున్నాం. ఏం సరదానో ఏమో, హోళీ అన్న విషయం మరిచిపోయి పొద్దెక్కేదాకా పడుకున్నందుకు, లేపుకొచ్చి నెత్తి మీద గుడ్డు కొట్టి కిందనుంచి మన్ను తీసి పోసారు... దుమ్మంతా తలలోంచి పోవడానికి గంట కష్టపడి మూడు శాంపూ సాచెట్లు అరగదీస్తే కానీ దారికి రాలేదు. అది పక్కన పెడితే, అలా ఆడుకుని స్నానాలు అయ్యాక అందరం కలిసి లంచ్ కి వెళ్లేముందు అలవాటు ప్రకారం ఒకచోట కలుసుకున్నాం. అక్కడినుంచి మెస్‌కి పోతుండగా ఎవడో అన్నాడు.. ఎటైనా ట్రిప్ వేద్దామురా అని... అక్కడ మొదలైంది, మా పరిశోధన. భోంచేసి వచ్చి అందరం కలిసి ఒక గ్రూప్ డిస్కషన్ పెట్టుకున్నాం, ఎక్కడికి వెళ్దాం అని. మొదలు మైసూరుకు 80 కిలోమీటర్ల దూరంలో వున్న గోపాలస్వామి బిట్ట అనుకున్నాం. చూస్తే మంది ఎక్కువ, బండ్లు తక్కువ వున్నాయి. సరే, కొందరు ఏ సుమోనో క్వాలిసో మాట్లాడుకుని పోతే సరిపోద్ది అనుకున్నాం. అంతలో మా రూమ్మేటు కొందరు బండ్లమీద, ఇంకొందరు కార్లో పోవడం ఏంటి, పోతే అందరం ఏ స్వరాజ్ మజ్దానో పట్టుకుపోతే సరిపోద్ది కదా అన్నాడు. ఆ పెద్ద బండేదో మట్లాడుకునేటట్టయితే, ఈ బిట్ట దాకానే ఎందుకు, ఇంకొచం ముందుకు పొయ్యొద్దాం అనుకున్నాం. అలా ప్లాన్ చేసి, మరుసటి రోజు పొద్దున్నే అందరం కలిసి ఊటీ, కొడైకనాల్ చూసొద్దామని బయలుదేరాం.

మాకు దొరికిన డ్రైవర్ పేరు మైఖేల్ షుమేకర్ (అది మేము పెట్టిన పేరు). వాడు పొద్దున మైసూర్‌నుండి బయలుదేరి, 135 కిలోమీటర్ల దూరంలో వున్న ఊటీ కి తీసుకెళ్లడానికి 6 గంటల పైనే తీసుకున్నాడు. టైం తీసుకున్నాకూడా ఆ జర్నీని మేము బాగా ఎంజాయ్ చేసాం. ఎప్పుడో చూసిన తిరుపతి ఘాట్‌రోడ్డు, ఎప్పుడూ తిరిగిన చాముండి బిట్ట రోడ్డు తప్ప పెద్దగా ఘాట్‌రోడ్డులు తెలీని మాకు, ఒక్కసారిగా అంతపెద్ద కొండలు, మలుపులు తిరుగుతూ వెళ్లే రొడ్డు, దానికి తోడు చుట్టూ టీ తోటలు.. స్వర్గం కల్లముందు వున్నట్టు అనిపించింది. అలా ఎంజాయ్ చేస్తూ డైరెక్టుగా ఊటీలో దొడ్డబిట్ట కి వెళ్లిపోయాం. అక్కడ చూస్తే ఏముంది... మేఘాల పైన మేమున్నాం. గాళ్లో తేలిపోవడమంటే ఇదేనేమో అనిపించింది. దానికి తోడు, అప్పుడు అక్కడ చిన్నగా వాన, చలి. మొదలు చూస్తే అక్కడంతా ఫ్రెష్ క్యారట్, మసాలా అద్దిన శెనగలు గట్రా అమ్ముతున్న కౌంటర్లు కనిపించాయి. కానీ, టికెట్టు కొని పీక్‌పాయింటు చూద్దామని వెళ్తే అక్కడ ఒకడు చాకోబార్‌లు అమ్ముతున్నాడు. ముందు వాన్ని చూసి, ఇక్కడ ఐస్‌క్రీములెవడు తింటాడురా పిచ్చిప్యూన్ అనుకున్నా. విధి వక్రించి ఎవడో తింటూ కనిపించాడు. జిహ్వచాపల్యం వూరుకుంటుందా, నాకూ కావాలని గోల చేసింది. తప్పదనుకొని కొన్నా. ఆ చలిలో ఆ చాకోబార్... కేక. ఇప్పటికీ ఎవరైనా ఊటీ వెళ్తున్నామని చెప్తే వాళ్లకి నేను దొడ్డబిట్ట దగ్గర చాకోబార్ తినమని సలహా ఇస్తా. అంతలా నచ్చింది. దొడ్డబిట్ట తర్వాత ఊటీలో పెద్దగా పొడిచిందేమీ లేదు గానీ, ఆరోజు సాయంత్రం ఊటీ నుంచి కూనూర్ వరకూ టాయ్‌ట్రెయిన్‌లో ప్రయాణం మాత్రం అద్భుతం. ఆ తరువాత నేను ఊటీకి వెళ్లిన ప్రతీసారీ ఆ టాయ్‌ట్రెయిన్ ప్రయాణం చేస్తూనేవున్నా.

కూనూర్‌లో దిగాక మా మొదటి పని, రూము వెతుక్కోవడం. రూం వెతుక్కోవడం అనే కార్యక్రమం పూర్తి అయ్యేలోపే మా వాళ్లు అసలు కార్యక్రమానికి ప్రిపేర్ అయ్యారు. అదేదో రూం కోసమే ఆగినట్టుగా, దొరికేసరికి చేతిలో కవర్లు పట్టుకొని సిద్దంగా వున్నారు. ఎనిమిదింటికి రూములోకి వెళితే, ఎనిమిది అయిదుకి గ్లాసులు నింపి సిద్దమయ్యాం. కాకపోతే, మాకు అక్కడికి, మైసూరుకి పెద్ద తేడా తెలీలేదు. మామూలుగానే అనిపించింది. ఇక ఆ మర్నాడు కూనూరు చూసుకుని కొడైకనాల్ బయలుదేరాం. దార్లోనే కదా అని మధ్యలో పళని గుడి కూడా చూసేసాం. పళని అంగానే మాకందరికి గుర్తొచ్చే విశయం ఒకటుంది. దానికి ఆద్యం మాకున్న ఒక గొప్ప ఫ్రెండు. పేరు - కిరణ్ అలియాస్ . నిజం చెప్పొద్దూ, వీడు మన తోటరాముడు గారి దినకర్ కి కజిన్ బ్రదర్. తమిళనాడు బార్డర్ కి పక్కనే వున్న వూర్లో పుట్టి పెరగడం మూలాన నాకు తమిళ్ వచ్చు అని చెప్పేవాడు. దార్లో పళనిలో ఆగిదాం అని చెప్పగానే వాడు చెప్పాడు... నేను ఇదివరకు వెళ్లాను, కొండ పైవరకు రోడ్డు వుంటుంది, బండి నేరుగా గుడి ముఖద్వారం ముందు ఆగుతుంది అని చాలా చెప్పాడు. గుడి గురించి ముందు చెప్పినవాడు కొండ పైకి నడిచి వెళ్లాలి అని చెప్పినప్పుడు పుట్టిన కంగారు వాని మాటలతో దూరం అయ్యింది కూడా.

గుడిదాకా వెళ్లాక కానీ మాకు అర్థం కాలేదు. తీరా వెళ్లి చూస్తే అక్కడ కొండపైకి వున్నది రోడ్డు కాదు... రోప్‌వే. వాడు వెళ్లి ఎవరితోనో మాట్లాడి వచ్చి నదిచి ఎక్కితే మూడు గంటలు పడుతుందంట అన్నాడు. కొండ చూస్తే చిన్నగా వుంది, ట్రై చేద్దాం అని నడిస్తే ఎక్కడానికి 30 నిమిషాలు పట్టింది. ఎమైతేనేం, దర్శనం అయ్యింది. ఆరోజు సాయంత్రం ఆరుగంటలప్పుడు కొడై చేరుకున్నాం. నాకైతే ఊటీ కంటే కొడై బాగా నచ్చింది. రూములు తీస్కొని ఫ్రెషాయ్యక వెళ్లి వూరిమీద పడ్డాం. అక్కడికి మాకేదో అక్కడ ఆ టైంలో ఏదో చూసేద్దామని గుల పుట్టి కాదు కానీ, మా పని మీద మేము వెళ్లాం(ఆ పనేంటో అర్థం అయినవాళ్లు యువతరం కింద లెఖ్ఖ). అదేంటో, కొడై బస్టాండుకి మూడు దిక్కులా ఒక అరకిలోమీటరు వెళ్లాం. కనిపించిన ప్రతీ షాపులో అడిగాం. కూల్‌డ్రింకు కావాలి అంటే ఒక్కనిదగ్గరా ఫ్రిజ్జు లేదు. ప్రతీవాడూ అదేదో చిప్స్ పాకెట్ ఇచ్చినట్టు కబ్బొర్డులోంచి తీసిస్తున్నాడు. ఇప్పుడేం చెయ్యాలా అని మేమందరం ఒక షాపు ముందు నుల్చుని మా అంతర్జాతీయ మహాసభ నిర్వహిస్తూంటే ఇదంతా పక్కన వుండి అబ్సర్వ్ చేస్తున్న ఒకాయన మమ్మల్ని పిలిచి తెలుగులో మాకు అక్కడి వాతావరణం గురించి ఒక ఐదు నిమిషాలు క్లాసుపీకి, ఇది నాచ్యురల్ కోల్డు, మీకు పనికి వస్తుంది, ఇక్కడ హీటర్లే కానీ ఫ్రిజ్జులు వాడరు అని చెప్పి పంపాడు. కూనూర్‌లో కంటే కొడైలో ఆ రాత్రి మేము బాగా ఎంజాయ్ చేసాం.

ఇక్కడ ఒక విషయం చెప్పుకోవాలి. నాకు తెల్లవారుఝామున వచ్చిన కలలన్నీ నిజం అవుతుంటాయి. కానీ అదేంటో, అలా ఏదైనా కల వచ్చినప్పుడు లేవాగానే అనుకుంటా... ఇది జరిగే ఛాన్స్ లేదు అనో, లేకపోతే నిజ జీవితంలో ఇది జరగకుండా చూసుకోవాలి అనో... కానీ అది జరిగేవరకూ మళ్లీ అది గుర్తుకురాదు. ఇది ఇప్పుడు ఎందుకు చెప్పానంటే, నాకు ఊటీ వెళ్లడానికి ఒక రెండు నెలల ముందు ఒక కల వచ్చింది. అందులో మా బ్యాచ్ అంతా వున్నాం. అందరం గంటకు 10 రూపాయల అద్దె పెట్టి సైకిల్లు అద్దెకి తీసుకున్నట్టు. లేవగానే అనుకున్నా... ఇండియాలో గంటకి 10 రూపాయల అద్దెతో సైకిల్ తీసుకునే రేటు రావడానికి ఇంక చాలారోజులు పడుతుంది... అయినా నా రూమ్మేటు(మా బ్యాచులో, కలలో వాడు కూడా వున్నాడు కదా) సైకిలు రెంటుకి తీసుకుని తొక్కే సీనే లేదు అని. కానీ, మా వూరి వాగులో నీరు లేదు, నా ఆలోచనలో అర్థం లేదు. నా తెల్లవారుఝాము కలని నిజం కాకుండా ఆపే ధైర్యం ప్రకృతి చేయలేకపోయింది. అక్కడ ఒక లేక్ వుంది. దాని చుట్టు అందమైన రోడ్ వుంది. ఆ రోడ్ మీద సైకిలేసుకుని తిరగడం కూడా ఒక అనుభవమే. అందరూ ఆ అనుభవాన్ని అస్వాదించాలని, కొందరు ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు(????) అక్కడ ఆ రోజుల్లో గంటకు పది రూపాయల అద్దెపై ఇచ్చేవారు. ఇంకేముంది... "కల నిజమాయెగా, సైకిల్ నేను తొక్కగా" అని పాడేసుకుంటూ అందరం సైకిల్ తొక్కేసాం. మొత్తం ట్రిప్‌లో నేను అన్నిటికంటే ఎక్కువగా ఎంజాయ్ చేసిన ఘట్టం ఈ గంటన్నర సేపే.

అదేంటో, రిటర్న్‌జర్నీలో మా షుమేకర్‌కి మాంఛి మూడ్ వచ్చినట్టుంది... ఒంట్లో వున్న ఎనర్జీనతా కాల్లల్లోకి తెచ్చుకొని అక్సిలరేటర్ తెగ తొక్కేసాడు. ఏముంది... తెల్లారేసరికి మళ్లీ మైసూరులోకొచ్చి పడ్డాం. కానీ కమర్షియలైజేషన్ వల్ల సంభవించే పరిణామాలు ఎలా వుంటాయో నాకప్పుడు తెలిసింది. ఊటీ కమర్షియల్‌గా అభివ్రుద్ది చెందింది... ప్రతిగా అందాన్ని త్యాగం చేసింది. కానీ, అభివృద్ది తక్కువగా వున్న కొడైలో అందం, ఆనందం, ఆహ్లాదం తాండవం చేస్తున్నాయి అని.

17 మే, 2010

పెళ్లి - ఒక కన్‌ఫ్యూజన్

1995: 10వ తరగతి

పెళ్లంటే - పెద్దవాళ్లు చేసుకుంటారు. కట్నం పేరుతో డబ్బులిస్తారు. పెళ్లాం వస్తుంది... పనులు చేసి పెడుతుంది. కొత్త బంధువులు, కొత్త బంధుత్వాలు. బామ్మర్ది వస్తాడు. ఏ పని చెప్పినా చేసిపెడతాడు.

2000: ఇంజినీరింగ్ స్టుడెంట్

పెళ్లంటే - చదువు, ఉద్యోగం, పెళ్లి, పిల్లలు, వాళ్ల చదువులు, వాళ్ల పిల్లలు, మనువలు మనువరాల్ల చదువులు, చావు. ఇదీ జీవితం. మన మొహానికి అమ్మాయిలు పడే ఛాన్స్ కనుచూపుమేరలో కనపడట్లేదు కాబట్టి, బై ఫోర్సు అయినా, పెళ్లామే మొదటి గర్ల్ ఫ్రెండ్ అవుతుంది కాబట్టి పెళ్లానికి ఐశ్వర్య రాయి కి ఉన్నంత అందం, సునీతకున్నంత చక్కని కంఠం, అదేదో పాత సినిమాలో సావిత్రికున్నంత అణకువ, ఇంకేదో సినిమాలో సౌందర్యకున్నంత సంస్కారం గట్రా గట్రా వుండాలని ఎక్స్‌పెక్టేషన్స్...!!! ఇన్ని మంచి క్వాలిటీస్ వున్న పిల్ల నిన్నే ఎందుకు చేసుకోవాలీ అని నన్ను ఎవరూ అడగలేదు కాబట్టి... నేను కూడా ఆన్సర్ రెడీ చేసుకోలేదు.

2005: ఉద్యోగ ప్రయత్నం ("బేవార్సు"కి పర్యాయ పదం)

పెళ్లంటే - బరువు బాధ్యతలు, రెస్పాన్సిబిలిటీ, స్థిరత్వం, కుటుంబం, ఆనందం, జీవనసారం, తొక్క తోలు లాంటి ఏవో అర్థం తీలీని, సామాన్య మానవునికి అర్థం కాని ఒక జఢపదార్థం. కానీ, సంపాదన లేని మొగుడ్ని ఈ రోజుల్లో ఏ ఆడదీ గౌరవించదనీ, పెళ్లనేది తప్పించుకోలేని ఒక సామాజిక అవసరం కాబట్టి ఎంత తొందరగా సంపాదన మొదలు పెడితే అంత మంచిది అని ఒక ఫీలింగ్.

2010: ఎలిజిబుల్ బ్యాచిలర్

పెళ్లంటే - ఇది తర్వాత మాట్లాడుకుందాం.

ఇన్ని రోజులు కలిసున్న ఫ్రెండ్సుకి పెళ్లిల్లయిపోయాయి. పెళ్లిల్లు అంటె, తప్పుగా అర్థం చేసుకోవద్దు. మనిషికి ఒక్కటే అయ్యింది ప్రస్తుతానికి. పెళ్లేం ఖర్మ... ఒకరిద్దరు తండ్రులు కూడా అయ్యారు. అయ్యారు కానీ, స్వాతంత్ర్యం పోగొట్టుకున్నారనిపిస్తుంది నాకు అప్పుడప్పుడు. అర్ధరాత్రి, అపరాత్రి ని తేడా లేకుండా గాలికి తిరిగిన వాళ్లు ఇప్పుడు పట్టపగలు కూడా ప్రశాంతంగా తిరగలేకపోతున్నారు. ఏదైనా పని మీద బయటికి వెళ్తే, వచ్చేముందు ఎదో మాటవరసరకి గంటలో వస్తామని చెప్తారా... గంటా పది నిమిషాలవరకూ బాగానే వుంటుంది... గంటంపావు కాగానే ఫోను మోగుతుంది. ఎక్కడ, ఎందుకు, ఎంతసేపు, ఏమిటి... అంటూ ప్రశ్నల వర్షం మొదలవుతుంది. అసలే హాస్టలు, ఆ తర్వాత ఇంటికి దూరంగా ఉద్యోగం పేరుతో స్వాతంత్ర్యానికి అలవాటుపడ్డ ప్రాణమేమో.... ఉస్సూరుమంటుంది.

మాటవరసకి ఈవీకెండ్‌లో సినిమాకు పోదాం అని చెప్పి, తీరా వీకెండ్‌లో ఏదో పని పడి సినిమా పోస్ట్‌పోన్ చేస్తే పాపం వాళ్ల కష్ఠాలు చెప్పుకోతరం కాదు. ఇంకో రెండుమూడు వీకెండ్లు వరసగా సినిమాలకు తీసుకెళ్లినా ఇంట్లొ గొణుగుడు మాత్రం ఆగదు. ఆ గొణుగుడుని భరించలేక, ప్రతీ వారం బయటికి తీసుకెల్లి జేబుకు పడే చిల్లు పూడ్చలేక లోపల లోపల పడే బాధ కొంచెం కాదు.

పెళ్లంటే ఇన్ని కష్టాలుంటాయని తెలీని రోజుల్లో, అంటే, మా బ్యాచ్‌లో ఎవరికీ పెళ్లి కాని రోజుల్లో.. మొడటి వాడు పెళ్లి చూపులకు వెళ్తున్నప్పుడు అన్నాడు... పెళ్లి చేసుకుంటే, రోజు ఆఫీసునుంచి వచ్చేసరికి నీ కోసం ఎదురుచూసే మనిషి వుంటుంది. అసలు ఒక మనిషి నీకోసం ఎదురు చూస్తున్న ఫీలింగే ఎంతో బాగుంటుందిరా అని అన్నాడు. కానీ, మా రూములో అలానే ఎదురుచూసుకునే వాళ్లం. ఎవనికైనా లేట్ అయితే, రూములో వున్నవాడు ఫోన్ చేసేవాడు, ఎక్కడున్నావురా ఎప్పుడొస్తావురా అని... మరీ లేట్ అయ్యేలా వుంటే తప్పించి, అందరూ వచ్చాక అందరం కలిసే మొదలుపెట్టేవాళ్లం... తినుడైనా, తాగుడైనా, తిరుగుడైనా!!! కానీ ఈ ఎదురుచూపుల ఫీలింగ్ ఇన్ని రోజులు అనిపించలేదెందుకు చెప్మా? అని డౌటొచ్చింది. కాని వాడిని అడగలేదు... అసలే ముక్కోపి, అడిగితే ఎలాంటి ఆన్సర్ చెప్తాడో అని భయమేసి ఆగిపోయ్యా.

అసలిదంతా ఎందుకు మొదలెట్టానంటే, మా బ్యాచులో చాలామందికి పెళ్లిల్లయిపోయాయి. అఫ్‌కోర్స్, నాకింకా ఈ కష్టాలు మొదలవలేదనుకోండి. కానీ, నాకు అదే పెద్దకష్టం అయ్యిపోయింది. అసలే, ఈ మధ్యే లోను తీస్కొని మరీ ఇల్లు కొని అప్పులపాయ్యానేమో, ఈ అప్పుల మధ్య పెళ్లి అవసరమా అని నాకొక అనుమానం. కానీ అదో పెద్ద సమస్యే కాదన్నట్టు అందరూ సలహాలూ. ఈ మధ్య ఎవడు కలిసినా, ఎవనితో ఫోనులో మాట్లాడినా అటోమాటిగ్గా టాపిక్ నా పెళ్లి దగ్గరికి పోతోంది. మొన్న ఇలాగే ఒకడు ఫోన్‌చేసాడు. వాడేదో నా పెళ్లి ముహూర్తం కనుక్కోడానికే చేసినట్టు, ఫోన్ ఎత్తగానే పెళ్లెప్పుడురా అన్నాడు. టాపిక్ మార్చరా అంటే, ఇప్పుడు నేను మారుస్తా గానీ వచ్చే నెలలో మీ బంధువులందరూ గెట్-టుగెదర్ వుందన్నావుగా... అక్కడ అందరూ అడుగుతారు, వాళ్లకేం చేప్తావ్ అంటూ ఒక డౌటు లేపాడు. ఇప్పుడు నాకున్న సమస్య పెళ్లి కాదు, పెళ్లెప్పుడు అని అడుగుతున్న బంధువులకు, ఫ్రెండ్సుకు సమాధానం... నాకిన్ని కష్టాలు వస్తాయని కలలో కూడా అనుకోలేదు...:-( ఇప్పుడు కూర్చుని అందరికీ చెప్పాల్సిన సమధానం గురించి ఆలోచించాలి... ఏం చెప్పాలో ఎనీ ఐడియా...?!?!?!?!

07 మే, 2010

మన కోరిక నెరవేరేనా...!!!?

ఉజ్వల్ నికం - ఒక గొప్ప న్యాయవాది. తన వాక్పటిమతో న్యాయాన్ని నిలబెట్టేవాడు... నిలబెడుతున్నవాడున్నూ! లేకుంటే ఇన్ని ప్రతిష్ఠాత్మకమైన కేసులకి ఎన్నో రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం తన తరఫు న్యాయవాదిగా నియమించుకోవు కదా. ఈమధ్యే తెలిసింది... తన వాక్పటిమతో ఇప్పటికి వంద పైచిలుకు మందికి జీవితఖైదులూ, డజన్లమందికి మరణశిక్షలూ పడేలా చేసాడని. ఇప్పుడాయన గురించి ఎందుకు చెప్పానంటే మొన్ననే అతనొక కేసు గెలిచాడు. అదే... ముంబాయి మీద తెగబడ్డ ముష్కరులలో ఒకడైన కసబ్ తాలూకూ కేసు. అతని పేరుతోనే మొదలుపెట్టడానికి రెండు రీజన్లిన్నాయి. ఒకటి, ఈ టపాని ఒక పాజిటివ్ నోట్‌తో మొదలెట్టాలని. రెండు, కసబ్‌ని చంపాలనే సగటు భారతీయుని కోరికను తను చట్టపరంగా తీర్చే వెసులుబాటు కల్పించాడు. కానీ మన (సగటు భారతీయుని) కోరిక తీరుతుందా... లెట్ అస్ ఇన్వెస్టిగేట్. రండి, విశ్లేషిద్దాం.

కొన్ని సంవత్సరాల క్రితం, అనగా 2001లో, భారత రాజ్యాంగ వ్యవస్థకు పట్టుకొమ్మ, భవిష్యభారతానికి దిశానిర్దేశం చేసే సభాభవనాల సముదాయం - భారత పార్లమెంటు భవనంపై తీవ్రవాదుల దాడి జరిగింది. దాడిలో ప్రత్యక్షంగా పాల్గొన్న ఐదుగురు తీవ్రవాదులూ మరణించారు. వారితోపాటు ఆరుగురు పోలీసులు (వారిలో ఒకరు మహిళ) మరియు ఒక తోటమాలి. ఆ తరువాత 2004 వరకు ఈ కేసులో చాలా పురోగతి కనిపించింది. ఈ దాడితో సంభందమున్న వారిని అరెస్టు చేసి, కోర్టులో విచారణ జరిపించడం, పట్టుకున్న అందరినీ దోషులుగా కోర్టు తేల్చడం, అఫ్జల్ గురు అనే ఒకనికి ఉరి శిక్ష వేయడం, తీర్పులపై ఉన్నత న్యాయస్థానికి వెళ్లడం, సుప్రీంకోర్టు ఉరిశిక్షను ఖరారు చేయడం... అన్నీ జరిగిపోయాయి. కేసు ఇన్ని కోర్టులు తిరిగి, ఇంత త్వరగా తీర్పు రావడం సామాన్యుడికి భారత న్యాయ వ్యవస్థ మీద నమ్మకాన్ని కొంచం పెంచాయి. ప్రతీ పౌరుడు అఫ్జల్కి పడ్డ ఉరిశిక్షని అమలుచేసే తేదీ కోసం ఎదురు చూసారు. ఒక సుముహుర్తాన, ఆ ముహూర్తాన్ని కూడా ప్రకటించారు. అక్కడినించి, సదరు ఉరిశిక్షని ఆపండంటూ మన సోకాల్డ్ సెక్యులరిస్టులు చక్రాలు తిప్పారు.

అతని భార్య 'నా భర్తకు క్షమాభిక్ష పెట్టండి మహాప్రభో' అని అప్పటి రాష్ట్రపతి కలాం అయ్యవారికి ఒక నివేదిక పెట్టుకుంది. అది మీడియా ప్రసారం చెయ్యడం ఆలస్యం, సదరు రాజకీయ పార్టీలు రంగంలోకి దిగాయి. మేధావి వర్గానికి చెందినవారు కొందరు అఫ్జల్‌ని బలి పశువుగా వర్ణించారు. కాషాయాన్ని నమ్ముకున్నవారు మాత్రం ఉన్నపళంగా ఉరితీయాలని పట్టుబట్టారు. చివరికి బంతి కలాం గారి కోర్టులో పడింది. ఆయనగారు అధ్యక్ష భవనం నుంచి పోతూ పోతూ చట్టం తనపని తాను చేసుకుపోతుంది, నేను తలదూర్చను అని చెప్పేసి వెళ్లిపోయారు. మళ్లీ ఎన్నికలొచ్చాయి. సెక్యులరిస్టులు అధికారంలోకొచ్చారు. సదరు అఫ్జల్‌గారి సెల్‌లోకి ఉష్ణనియంత్రన వ్యవస్థ కూడా అప్పుడే వచ్చిందని అప్పట్లో వినిపించింది (నిజం దేవుడెరుగు). ఇప్పటికీ అఫ్జల్ జైలులోనే AC సెల్లులో కూర్చుని కలర్ TV చూస్తూ పండగ చేసుకుంటున్నాడు. మన సెక్యులరిస్టు ప్రభుత్వాన్ని అడిగితే, మన ముసలి రబ్బరు స్టాంపు ముందు 29 అర్జీలున్నాయి. అఫ్జల్‌ది 25వది. మొదలొచ్చినవన్నీ పక్కనబెట్టి ఇది మొదలు ఎలా చూస్తారు... అందుకే మిగిలినవాటిపై నిర్ణయం తీసుకున్నాకే దీనిపై నిర్ణయం అని తెగేసి చెప్తున్నారు. ఈ లెఖ్ఖన మొదటి 24 అర్జీలు తేలేదెన్నడూ... అఫ్జల్‌ని ఉరి తీసేది లేదని ధైర్యంగా చెప్పేదెన్నడూ...!!! అయినా పార్టీ పెద్దలకుగుణంగానో, బడా వ్యాపారవేత్తలనుకుగుణంగానో ప్రయారిటీలు మారినప్పుడు లేనిది, అంతర్గత రక్షణ పేరుమీద ఈ విషయంలో ప్రయారిటీలు మార్చలేరా....? బహుశా "ఠాగూర్"లో చిరంజీవి అన్నట్టు, అన్యాయాన్ని నిలదీసినవాడిని మాత్రమే ఉరితీస్తారేమో... ఎవరికైనా ఈ విషయంమీద ఒక ఐడియా వుంటే చెప్పండి.

ఇప్పుడు కసబ్ విషయంలో కూడా ఇలాగే జరగదని ప్రజలకి నమ్మకం ఏంటి అన్నది నా సందేహం. (ఆ మాటకొస్తే నాకు కూడా నమ్మకం లేదు.) అన్నిటికంటే నాకు నవ్వు తెప్పించిన విషయం వేరొకటుంది. అది, కసబ్‌ని కోర్టు దోషిగా తేల్చిన రోజు మన కేంద్ర మంత్రి మండలిలోని ఒక మంత్రివర్య్లు ఒక మాట అన్నారు - 'ఇది పాకిస్తాన్‌కు ఒక హెచ్చరిక. ఇకనైన వారు తీవ్రవాదాన్ని పోశించడం మానుకోవాలీ వగైరా వగైరా... కానీ మన మంత్రివర్యులు అలోచించడం మరిచిందేమంటే, అఫ్జల్ విశయంలో జరిగింది చూసినతర్వాత అదే పాకిస్తాను పెద్దలకు మన ప్రభుత్వానికి అంతర్గత రక్షణపై వున్న అలసత్వం అర్థం కాదా అని. అన్నట్టు ఇక్కడో విషయం చెప్పుకోవాలండోయ్... ఇదివరకు ఇలానే కొందరిని పట్టుకొని జైలులో పెట్టి మేపితే, వాళ్లు తిన్నరగట్లేదు... కానీ బుద్ది పెరిగింది, తీసుకెళ్తే ఇంకా మంచి దాడులు చేస్తాం అని వాళ్ల పెద్దలకి కబురంపారంట. వెంటనే వాళ్లు ఒక విమానాన్ని హైజాక్ చేసి, వాళ్లని విడిపించుకున్నారు. వాళ్లలో ఒకడే, ఈ అఫ్జల్ గురు ని తయారు చేసాడనుకుంటా. ఇంకొకడు ముంబాయి లోకల్ ట్రైనులల్లో బాంబులు పెట్టించడమో ఏదో చేసాడు. చూస్తే వీళ్లిద్దరినీ కూడా ఇంకా భయంకర దాడులకు వ్యూహరచన చేసుకునేదాకా మన డబ్బులతో మేపి పంపించేటట్టున్నారే...? అయినా మన రాతే ఇలా వుంటే ఏం చేస్తాం లెండి. పదో పరకో పడేస్తే వచ్చే బుల్లెట్‌తో పోయే ప్రాణాన్ని నిలబెట్టి కోట్లు ఖర్చు పెట్టి బిర్యానీలతో మేపి, కోర్టులచుట్టూ తిప్పి, AC రూముల్లో పడుకోబెట్టి మళ్లీ మనమీద దాడులెలా చేయ్యాలో ఆలొచించమంటున్నాం... వద్దులెండి.. ఇంక రాయను.. నోటికెచ్చే మాటలను చేతిదాకా తేవడానికి సంస్కారం అడ్డొస్తోంది.

03 మే, 2010

హైదరాబాద్ ప్రయాణం

పోయిన శుక్రవారం నాడు బెంగళూరు నుంచి హైదరాబాదుకి వచ్చాను. ఆ ప్రయాణం నాకొక కొత్త అనుభవం. ట్రైన్‌లో వద్దామనుకున్న నాకు ఆఫీస్‌లో లేట్ అయ్యి ట్రైన్ మిస్సయ్యింది. ఒక ఫ్రెండు పుణ్యమా అని, KSRTCలో చివరి బస్సుకి ఒక టికెట్ దొరికింది. అసలే మూడు వారాలకి డెప్యుటేషన్ మీద వస్తుండడం, అది కూడా చివరి నిమిషంలో డిసైడ్ అవ్వడం వల్లనూ, ఆఫీసులో వున్న గొడవలన్నీ వదిలించుకునేసరికి ట్రైన్ తుర్రుమంది. సాయంత్రం వైట్‌ఫీల్డులో వున్న ఆఫీసునుండి ట్రాఫిక్‌లో పడి HSR లే-అవుట్‌లో వున్న రూముకి చేరి బట్టలు సర్దుకునేసరికి బస్సుకి టైమైందనే తొందర మొదలైంది. మళ్లీ అక్కడినుంచి మారతహళ్లి కి వచ్చి, టికెట్టు బుక్ చేసిన ఫ్రెండు వచ్చేంత వరకు ఎదురు చూసి, టికెట్ తీసుకునేసరికి... నీకు తోడుగా నేనున్నానంటూ వానొచ్చేసింది. అక్కడే నేను హీరోగా 'వానలో అభిమన్యుడు' అనే సినిమా షూటింగ్ మొదలైంది.

కార్పోరేషన్ సర్కిల్ దాటగానే అలవాటు ప్రకారం ట్రాఫిక్ జాం అయ్యింది. కొంతసేపు ఎదురుచూసా. అప్పుడర్థమైంది - ఎంతసేపు ఎదురు చూసినా బస్సు ముందుకి కదలాలంటే టైం ఎక్కువ పడుతుందీ అని. ఇంకోవైపు బస్సు టైమవుతోంది. ఇక తప్పదన్నట్లుగా, బ్యాగు మోసుకుంటూ, వానలో తడుచుకుంటూ బస్టాండుకి పరిగెత్తా. అప్పటికీ లేటయ్యాననుకోండి, అది వేరే విషయం. పదిన్నర బస్సుకోసం పది ముప్పావుకి ప్లాట్‌ఫారం దగ్గరికి చేరుకున్నా. వాన పడటం వల్లో, ట్రాఫిక్‌జాం వల్లో తెలీదుగానీ బస్టాండు మాత్రం మేడారం సమ్మక్క జాతరలాగా నిండుగా వుంది. అందులో బస్సు వుందో పోయిందో తెలీక అంతర్రాష్ట్ర సర్వీసులు ఆగేచోట ఆకొస నుండి ఈకొస దాకా తిరుగుతూ, పట్నం బోర్డేసుకున్న ప్రతీ ఐరావత బస్సునూ ఇది నా బస్సేనా అని అడుగుతూ తిరిగేసా. పదకొండుంపావుకి నాకు అర్థం అయ్యింది. నా బస్సింకా రాలేదు అని. సరే అని ఓ పక్కన నిలబడి తల తుడుచుకుంటూ టైము చూస్తే పదకొండున్నర అయ్యింది. సరే మళ్లీ ఒకసారి చూద్దాం అని మళ్లీ అంతా తిరిగితే బస్సు దొరికంది. బస్సెక్కుదామని చూస్తే బస్సు ముందు, మెట్ల మీద, ఏజిల్ లో అంతా నిలబడి వున్నారు.

బస్సు ఇప్పుడే వచ్చిందోమో, అంతా ఇప్పుడే ఎక్కుతున్నారు కాబోలు అని కొంతసేపు నిలబడ్డాను. కానీ ఎంతసేపు నిలబడ్డా ఒక్కడు కూడా కదలడే. ఇక లాభం లేదనుకుని, నేను కూడా గుంపులో దూరి అష్టకష్టాలూ పడి, మొత్తానికి బస్సు డోరు దగ్గరికి వెళ్లి చూస్తే అన్ని సీట్లల్లో జనాలు కూర్చున్నారు. అసలేం జరుగుతోందో అర్థం కాలేదు. ముందున్న పెద్దమనిషిని కదిపి పదిన్నర బస్సు ఇదేనా అడిగితే వెల్లి బోర్డుమీద సర్వీసు నంబరు చూసుకోమన్నాడు, అదేదో ఇది హైదరాబాదు బస్సు కాదు అన్నట్టుగా మొహం పెట్టి. నిజం చెప్పొద్దూ, వాని మొహం చూస్తే అది నేనెక్కాల్సిన బస్సు కాదేమో అని అనుమానం వచ్చి వెళ్లి బోర్డు కూడా చూసా. అక్కడ చూస్తే పట్నం పేరు రాసాడే కానీ సర్వీసు నంబరు కానీ, టైము కానీ ఏదీ లేదు. మళ్లీ అందరినీ తోసుకుంటూ వచ్చి, అంతకు ముందడిగిన పెద్ద మనిషిని కాస్త పక్కకు తప్పుకోమన్నా. అదేదో, నేను వాని జాగా కబ్జా చేసి అడిగితే బూతులు తిట్టినట్టు మొహం పెట్టి సర్వీసు నంబర్ చూసుకొమ్మన్నా కద సార్ అన్నాడు. అక్కడ లేదు అని నేను చెప్పకముందే, వెనకనుంచి టికెట్లు చెక్ చేసుకుంటూ వచ్చిన కండక్టరు ఇంకా రిసర్వేషన్ వున్నవాల్లు ఎవరు అని అడిగాడు. నేను టికెట్ తీసి చూపగానే లోపలికొచ్చి కూర్చొమ్మన్నాడు. ఒక రెండు నిమిషాలాగాక అర్థం అయ్యింది. సర్వీసు నంబరు చూసుకొమ్మన్నవాడితో సహా అందరూ రిసర్వేషన్ లేనివాల్లు అని.

ఒకవైపు చూస్తే అదే చివరి బస్సు. వీళ్లంతా వెళ్లి ఎదురుగా వున్న ట్రావెల్సుకి పోతే ఏ రేటు చెప్తాడో తల్చుకుంటేనే జాలేసింది. కానీ, కండక్టరుని చూస్తే ఇంకా జాలేసింది. పదిన్నరకి వెళ్లాల్సిన బస్సు, పన్నెండైనా అక్కడే వుంది. బస్సులో చూస్తే, ఒక 20 మంది, రవితేజ స్టైల్లో ఒక్కసీటు అని అడుగుతూ, దిగమని ఎన్నిసార్లు చెప్పినా దిగకుండా సతాయిస్తున్నారు. చివరాఖరికి, కంట్రోలర్ వచ్చి అందరిని కన్నడంలో తిట్టడం మొదలెట్టాక చాలావరకు దిగిపోయారు. మరి వాల్లు ఈ తిట్లు అర్థమై దిగారో, లేక వాని గొంతు వినలేక దిగారో తెలీదు. కానీ ఒక ముగ్గురు మాత్రం వాల్లకి వాల్లు 'నేను సీతయ్యా' అనుకుంటూ మొండికేసారు. పాపం, ఆ కండక్టరు బస్సు మజెస్టిక్ దాటే వరకూ దిగమని వాల్లను ఒక రకంగా ప్రాధేయపడ్డాడు. చివరికి వాల్లను బస్సులో వుంచడానికి వొప్పుకునేదాకా వొదల్లేదు. కానీ వచ్చిన సమస్యంతా ఆ ముగ్గురూ ఏజిల్‌లో పడుకోవడం. పాపం ఒకావిడ మధ్యలో బస్సు ఒకసారి ఆపమని అడగడనికి 30 నంబరు సీటు నుంచి ముందుకి రావడానికి ఒక పది నిమిషాలు కష్టపడింది. మొత్తానికి బస్సాగింది. అంతసేపు ఆ అమ్మాయి పడిన కష్టాన్ని సినిమాలాగా చూసిన ఆ రిసర్వేషన్ లేని మహానుభావుడు, అందరూ ఇక్కడే బ్రేకు తీసుకుంటే బాగుంటందని అందరికీ వినపడేలాగా తన అమూల్యమైన అభిప్రాయాన్ని చెప్పేసాడు.

కొందరు ఆ అభిప్రాయానికి లోపల తిట్టుకున్నారు. ఇద్దరు ముగ్గురు మాత్రం బహిరంగంగానే (పద్దతి ప్రకారం చెప్పాలంటే) విమర్శించారు.

19 ఏప్రిల్, 2010

మోడీ-థరూర్: ఏది నిజం?

ఇక్కడికి నేనేదో భీభత్సమైన అనలిస్టుని అనుకుంటే మీరు రమ్ములో కక్కేసినట్టే. నేను అనలిస్టుని కాదు కదా, కనీసం ఒక పిల్ల జర్నలిస్టుని కూడా కాదు. నేను అనుకున్నదే నిజం అనుకునే అమాయక చక్రవర్తిని కాబట్టి, టైటిల్ జస్టిఫై అవుతుందని ఆ టైటిల్ పెట్టానంతే. ఇక విషయానికి వద్దాం.

అనగనగా, మోడీ అనే పెద్దమనిషి ఒక పెద్ద ఆటల పండుగని డిసైన్ చేసి, మార్కెట్ చేసి, టీములని అమ్మేసి, కొన్ని వేలకోట్ల వ్యాపారాన్ని తయారుచేసాడు. మొదాటి ఏడాది అంతా బాగానే జరిగింది. రెండో ఏడాది వచ్చేసరికి ఆసేతుహిమాచలంలో ఎన్నికలొచ్చి, ఆటలపండుగని వేరే దేశానికి, ఆ మాటకొస్తే వేరే ఖండానికి మార్చారు. అక్కడ కూడా పండగ బాగానే సాగింది. అయితే పండగ ఇంటికి దూరంగా చేసుకుంటున్నాం కదా అని సదరు మోడీగారు కాస్త ఎక్కువగానే పండగ చేసుకున్నారు. అప్పటివరకు సదరు పెద్దమనిషిని ఒక వ్యాపారవేత్త అనే అనుకున్న సామాన్యజనం ఈ పెద్దమనిషిలోని రసికుడిని కూడా గుర్తించారు. అదే సమయంలో పండగ జరుగుతున్న ఖండంలో పండగకు డిమాండు పెంచడానికి రకరకాల పోటీలు పెట్టారు. అందులో ఒక పోటీలో అందమైన ఒక లోకల్ మోడెల్‌ని సెలెక్ట్ చేసి ఆమెని ఇండియాకి రమ్మన్నారు. ఆ టైంలో సదరు మోడెల్‌కి చాలా కాంట్రాక్టులు దక్కాయని అప్పట్లో వినికిడి. నిజం పెరుమాల్లకెరుక.

సదరు మోడీగారు, ఈ పండగలో వున్న సమయంలో అఖండభారతావని తన పాలకులను ఎన్నుకునే అత్యంత ఖరీదైన భారీ ప్రక్రియను ముగించింది. ఈ ప్రక్రియలో అంతవరకు ఐక్యరాజ్యసమితిలో పనిచేసి, ఒక పర్యాయం ఐక్యరాజ్యసమితి అధ్యక్షునిగా పదవి వెలగబెడదామనుకుని, సాటి ఆసియా ఖండపువాని చేతిలో ఓడి ఇంటిదారి పట్టిన థరూర్ అనే మరో పెద్దమనిషి ఇంటికి రాగానే, ఉజ్యోగం మానేసి, రాజకీయాల్లోకి దిగి, అంతర్జాతీయ దౌత్యంపై తనకున్న అనుభవాన్ని చూపి ఒక సీటు కొట్టేసాడు. దేశవ్యాప్తంగా ఆపార్టీకి వచ్చిన స్పందనలో కలిసిపోయి జాతీయ దిగువసభలో సభ్యుడు కూడా అయిపోయ్యాడు. ఎలాగూ ఎన్నికల్లో గెలిచాడు కదా, అంతర్జాతీయ దౌత్యంలో ఉన్న అనుభవాన్ని వాడుకుందాం అని ఆశించిన ప్రభుత్వపెద్దలు ఇతనికి విదేశీ వ్యవహారాల శాఖలో ఒక సహాయపదవిని ఇచ్చి సరిపెట్టేసారు. ఈ పెద్దమనిషి అంతర్జాతీయ సమితిలో ఏమి దౌత్యం వెలగబెట్టాడో తెలీదు కానీ, ఈయన మంత్రి అయినదగ్గర్నించీ ప్రభుత్వానికి ఏదో ఒక తలనొప్పి క్రమంతప్పకుండా తేవడం మొదలుపెట్టాడు.

సదరు మోడీగారు ఎన్నుకుని రమ్మన్న సుందరి భారతగడ్డపై కాలుమోపింది. ఆ విషయం చాలా మీడియా హౌసులు ప్రచారం చేసాయి. కానీ, ఆ తర్వాత ఆ సుందరి విషయం పక్కన పెట్టేసాయి. తెలియవచ్చిన విషయం ఏమిటంటే, సదరు సుందరి చాలాకాలం (అంటే ఎంతకాలమో నాకు కూడా తెలియదు, కాని వీసా గడువు ముగిసేంతవరకు) ఇక్కడే వుంది. ఎక్కడ వుందో, ఎలా వుందో విజ్ఞ్యులకు నేను చెప్పాల్సిన పనిలేదు. వీసా గడువు ముగిసేముందు, సదరు మోడీగారు ఆ అమ్మణ్ని మరికొంత కాలం ఇక్కడే అట్టిపెట్టుకోడానికి వీసా పొడిగించుకోవాలని అనుకున్నారు. అనుక్కున్నదే తడవుగా ఢిల్లీలో వున్న సదరు మంత్రిత్వశాఖ వారిని కలుద్దామని వెళ్లారు. తీరా అక్కడికి వెళ్లాక చూస్తే వున్నది థరూర్ అనే పెద్దమనిషి. ప్రభుత్వంలో సభ్యుడైన ఆయనకి, ప్రైవేటు వ్యాపారి అయిన ఈయన ఒక వినతిపత్రం సమర్పించి పని చేసి పెట్టమన్నాడంట. దానికి ఆ మంత్రివర్యులు అభయహస్తం ఇచ్చి పంపారు. మంత్రిగారి ఆశీర్వాదం దొరికింది కదా అని ప్రశంతంగా వున్న మోడీగారికి ఒక పెద్ద షాక్ తగిలింది. అది సుందరమోడల్‌కి వీసా దొరకలేదు అని. ఇద్దరికీ ఇక్కడే చెడింది అని ఇప్పట్లో వినవస్తోంది.

చెడితే చెడింది. ఏదో ప్రపంచానికి తెలీని మ్యాటర్‌లో కొట్టుకుంటే ఏ గొడవా వుండేది కాదు. కానీ, చివరొకొచ్చి ఇద్దరూ ప్రపంచమంతా పేరు తెచ్చుకున్న ఆటల పండగ మీద గొడవ పెట్టుకున్నారు. ఎనిమిది కంపనీలతో మొదలైన ఆటల పండుగను పది కంపనీలకి పెంచి సంపాదన పెంచుకుందామనుకున్నాడు మన మోడీ. ఏదైనా ఒక్క కంపనీలోనైనా వాటా పెట్టుకోవాలనుకున్నాడు మన థరూర్. అనుకున్నదే తడవుగా సొంత రాష్ట్రంలో పెడుతున్న టీముని కొందామనుకున్న ఒక కన్సార్టియంతో మాటలు కలిపాడు. మనోడి రాజకీయ ప్రోద్బలం దక్కుతుందన్న ఆశతో కొన్ని కోట్ల వాటా అప్పనంగా ఇవ్వడానికి వాల్లు కూడా ముందుకొచ్చారు. (కేవలం రాజకీయ లబ్ది కోసమేనో లేక ఇంకా ఎవైనా డీల్సు వున్నాయొ తెలీదు మరి). అది కూడా డైరెక్టుగా తీసుకుంటే కాషాయ పార్టీ, ఎర్రపార్టీలు గొడవ చేస్తాయని అనుకున్నాడో ఏమో గానీ, ఎక్కడో ప్రశంతంగా బతుకుతున్న గర్లుఫ్రెండుని తీసుకొచ్చి, తన పేరుమీద వాటా ఇప్పించుకొని ఈరొంపిలోకి లాగేసాడు. ఇక్కడ తప్పు ఒకరకంగా చెప్పాలంటే మోడీదే. రాజకీయనాయకుడికి తెలిసినట్టుగా ప్రతీకారం తీర్చుకోవడం వ్యాపారికి తెలీలేదు. ఎలాగైనా థరూర్ పరువు తీయాలి ఆలోచనతో కొచ్చి టీం గురించి పబ్లిక్‌గా బయటపెట్టి సొంత కొంప కూడా కూల్చుకున్నాడు.

మొత్తంగా ఈ వ్యవహారం నుంచి రాజకీయనాయకులు, బిసినెస్‌మాన్‌లు నేర్చుకోవాల్సిన నీతి ఒకటి వుంది. రాజకీయం చేసేవాడికి వ్యాపరం చేసేవాడి తోడు వుండాలి. వ్యాపారం చేసేవాడికి రాజకీయనాయకుడి అండ వుండాలి. అప్పుడే ఇద్దరు కలిసి దేశాన్ని దోచేయగలుగుతారు. వాళ్లిద్దరూ కొట్టుకుంటే ఇద్దరూ రచ్చకెక్కి పరువు పోగొట్టుకోవడం తప్పించి వచ్చే లాభం మాత్రం నిండుసున్నా.

07 ఏప్రిల్, 2010

అరిటిపండు - కోవా

చిన్నప్పుడు నేను అరటిపళ్లు, కోవా బాగా తినేవాన్ని. ఇంటి ముందు అరటిపళ్ల బండి వచ్చినా, కోవా అమ్మేవాడు వచ్చినా మా అమ్మకు సినిమా....! కొనేవరకూ ఆగేవాన్ని కాదు. ఇప్పటికీ మా అమ్మ అంటూవుంటుంది... చిన్నప్పుడు ఎటైనా తీసుకెళ్తే, అరటిపళ్ల బండి కనిపించడం పాపం, అక్కడినుంచి అడుగు ముందుకు వేసేవాన్ని కాను అని. అలా ఇంటిముందు బండి వచ్చినప్పుడు, కోవా అమ్మేవాడు తట్ట పట్టుకొచ్చినప్పుడు నేను చేసే గోల భరించలేక మా అమ్మ ఒక ఐడియా వేసింది. అదే పరిచయాలు. నాకు ఒక అరటిపళ్ల బండి వాడిని, కోవా అమ్మేవాడిని చూపించింది. అప్పటినుంచి వాళ్లు ఎక్కడ కనిపించినా తీసుకోవచ్చని చెప్పింది. మామూలుగానే మనం సెంటీమీటర్ చనువిస్తే కిలోమీటర్ దూసుకెళ్లే టైప్ కాబట్టి ఇంక దున్నేసుకున్నా.

స్వతహాగా నాకు చిన్నప్పటినుంచీ వున్న టాలెంటు వల్ల ఫ్రెండ్ సర్కిల్ చాలా పెద్దగా వుండేది. నా లైఫ్‌లో ఇప్పటికీ మారనిది ఎదైనా వుందీ అంటే అదే.... అతిశయోక్తి కాదు గానీ, ఎందుకో నాకు ఫ్రెండ్సు ఎక్కువ. రీసెంటుగా మా అమ్మకు ఒక జ్యోతిష్యుడు కూడా చెప్పాడంట... మీ వాడు ఎక్కడ ఎలా వున్నా ఎప్పుడూ పక్కన ఓ నలుగురు తోడు వుంటారు అని. ఇప్పటికే మ్యాట్టర్ అర్హమై వుంటుంది మీకు, ఈ ఉపోద్ఘతమంతా ఎందుకు ఇచ్చానో. యూ ఆర్ రైట్. అమ్మ చూపిన అరతిపళ్ల బండి వాడు కానీ, కోవా బుట్ట వాడు కానీ వూర్లో ఎక్కడ కనిపించినా నేను కుమ్మడం మొదలెట్టేవాన్ని. మనం కుమ్మడమే కాకుండా, పక్కన వున్న మిత్రబ్రుందాన్ని కూడా కావలిసినంత కుమ్మమని ప్రోత్సహించేవాన్ని. ఇక్కడ రెండు విషయాలు చెప్పుకోవాలి.

ఒకటి, అరటిపళ్ల బండి వాడు, కోవా బండి వాడు ఇంటికెల్లి పైసలడిగినప్పుడు ఎంత బిల్లు ఇస్తారో ఆలోచించకపోవడం.
రెండు, వాడు ఇచ్చే బిల్లు గురించి ఇంట్లోవాల్లు నన్ను అడుగుతారని ఆలోచించకపోవడం.

అసలు చెప్పాలంటే, వాళ్లు ఇంటికి వెళ్లి పైసలడుగుతారని కూడా అప్పట్లో నాకు తెలిసేది కాదు. ఫ్రీగా ఇస్తున్నారనుకునేవాన్ని. అప్పట్లో నేను అంత అమాయకున్ని. మొదట్లో అంతా బాగానే నడిచింది. నేను తింటూ పోయేవాన్ని. మా అమ్మ డబ్బులు ఇచ్చేసేది. నాకైతే ఇంక జీవితాంతం ఇలా ఫ్రీగా అరటిపళ్లు, కోవా తినేస్తూ బతికేస్తాననిపించింది. కానీ నా ప్లానింగ్ అంతా అనుకోకుండా ఒకరోజు గాల్లొ కలిసిపోయింది. కారణం, అరటిపళ్లబండి వాడు ఆరోజు మా అమ్మ దగ్గరికి కాకుండా మా నాన్న దగ్గరికి వెళ్లి డబ్బులు అడగడమే. వాడు డబ్బులు అడగడం పెద్దగా దెబ్బెయ్యలేదు కానీ, అలవాటు ప్రకారం మా నాన్న వాన్ని లెఖ్ఖ అడిగాడు. ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ ఎన్నెన్ని తిన్నాడో లెఖ్ఖ చెప్పమన్నాడట. దానికి వాడు నీల్లు నమిలాడంట. మామూలుగా అయితే ఆ సిట్యుయేషన్‌లో మా నాన్న వాడికి డబ్బులు ఇచ్చేవాడు కాదు. కానీ ఏదో ఆ సమయానికి అక్కడ మా మామయ్య వుండడం వానికి కలిసి వచ్చింది. వాన్ని లెఖ్ఖ అడగడం ఆలస్యం, మా మామయ్య మా నాన్నతో వాడేమన్నా వందలు వేలు అడిగాడా, యభయ్యే కదా, ఇచ్చి పంపక వానితో లెక్కలెందుకు అని అడిగిన వెంటనే ఇప్పించేసాడంట. అంతే, ఇంక ఇంటికి రాగానే, ముందు నన్ను పిలిచి ఎందుకు తిన్నావ్ అని మొదటి ప్రశ్న. ఆ బండి వాళ్లని ఎందుకు చూపావ్ అని మా అమ్మకు రెండో ప్రశ్న. అలా హార్డ్ క్వష్చనింగ్ తర్వాత నాకు ఒక డెడ్లీ వార్నింగ్ కూడా వచ్చింది. ఇంకోసారి బండి కనపడగానే పళ్లమీదకి దండయాత్ర చేస్తే............ అందరం ఆ వయసు నుండి వచ్చిన వాల్లమే కదా, ఎమన్నారో చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా!!!

24 మార్చి, 2010

హాస్టల్‌లో అర్ధరాత్రి

మా ఇంజినీరింగ్ కాలేజీకి హాస్టల్ వుండేది కాదు. ఫస్ట్ ఇయర్‌లో మేము ప్రైవేట్ హాస్టల్‌లో వుండేవాళ్ళం. మా కాలేజీ దగ్గరవున్న లేఅవుట్‌లో అలాంటివి చాలా వున్నాకూడా, మా బ్యాచ్ మొత్తం రెండు హాస్టల్లల్లోనే వుండేది. ఒకటి(నేనున్నది) ప్యూర్లీ అబ్బాయిల హాస్టల్ అయితే ఇంకొకటి అమ్మాయిలు, అబ్బాయిలు ఇద్దరికీ (ఒకటే బిల్డింగ్ కాదులెండి. అబ్బాయిలకి రెండు బిల్డింగులు, అమ్మాయిలకు ఒకటి విండేవి). బిల్దింగులు అంటే ఇళ్లని అద్దెకి తీసుకుని వాటిలో హాస్టళ్లు పెట్టేసారు. టాక్స్ కట్టాల్సిన అవసరం లేని బ్రహ్మాండమైన బిజినెస్ అది. ఈ హాస్టళ్లల్లో రాత్రుల్లు మేము చేసిన అల్లరి అంతా ఇంతా కాదు. మా హాస్టల్ ఊరికి చివరగా, ఎక్కడో విసిరేసినట్టుగా వుండడం మాకు కొంతవరకు కలిసివచ్చింది.

మా హాస్టళ్లో మొత్తంగా ఒక 30 మంది పైనే వుండేవాల్లం. ఒక 20 మందిమి మెయిన్‌రోడ్ నుంచి ఒక 100 మీటర్ల దూరంలో వుండే బిల్డింగ్‌లో వుండేవాల్లం. మిగిలినవాల్లంతా మెయిన్‌రోడ్‌ని ఆనుకుని వున్న బిల్డింగ్‌లో వుండేవాల్లు. ఒక ఏడాది పాటు ఆ హస్టల్లో మేము చేసిన అల్లరి అంతా ఇంతా కాదు. అప్పట్లో మైసూర్లో పోలీసుల గస్తీ ఎక్కువగా వుండేది. లోకల్ క్లాస్‌మేట్స్ అయితే మాటలతోనే భయపెట్టేవాల్లు - రాత్రి తొమ్మిది తర్వాత రోడ్డు మీద తిరగొద్దు, గరుడ(హైదరాబాద్ లో రక్షక్ లాగ) వాల్లు చూస్తే ఏమీ అడగరు, తీసుకెళ్లి ఠాణాలో కూర్చోబెట్టి పొద్దున పంపిస్తారు అని చెప్పేవాళ్లు. మనం చెప్పిన మాటలు వినే బాపతు కాదు అని అప్పట్లో వాల్లకి తెలీదు పాపం.

మైసూరులో అప్పట్లో రాత్రిపూట గస్తీకి గుర్రాల మీద తిరిగేవారు. ఓసారి అలా పోలీసోల్లు రాత్రి ఒంటిగంటప్పుడు రోడ్ మీద గస్తీ తిరుగుతున్నప్పుడు, అప్పుడప్పుడే ఈల వెయ్యడం నేర్చుకుంటున్న మా రఘుగాడు గట్టిగా ఈల వేసాడు. వానికి రాక రాక గట్టి సౌండ్ రావడం, అర్ధరాత్రి కావడం కలిసొచ్చి ఆ ఈల చాలా దూరం పాకింది. చూస్తున్నంతలో రోడ్ మీద పోతున్న గుర్రాలు మా హాస్టళ్‌వైపుకు తిరిగడం కూడా వెంటనే జరిగిపోయింది. మాకైతే భయం అంటే ఎలా వుంటుందో తెలిసింది. ఏం జరుగుతుందో తెలిసేలోపలే బెటాలియన్ మొత్తం మా బిల్డింగ్ ముందుకొచ్చింది. అప్పుడు మొదలైంది మాకు సినిమా. ఒక ఆరగంట సేపు మేమెవరమో, ఎక్కడినుంచి వచ్చామో మొత్తం ఎంక్వైరీ చేసి అనవసరంగా ఈల వేసినందుకు ఒక క్లాస్ పీకి వెళ్లారు.

గండం గడిచిందని సంతోషపడి ఒకరోజు సైలెంట్‌గా వున్నాం. రెండోరోజు రాత్రి నిద్రపట్టక రెండు గంటలప్పుడు గేటు ముందర టెప్ క్యాచులతో గల్లి క్రికెట్ ఆదుతున్నాం. దానికోసం గేటు దగ్గర ఒక పెద్ద లైటు కూడా పెట్టాం. ఆ లైటు చూసి రోడ్‌మీద వెలుథున్న ఒక ఎన్‌ఫీల్డు బండి లోపలికి తిరిగింది. సీదా వచ్చి మా ముందు బండి ఆపాడు. చూస్తే ఒక పోలీసాయన ఫుల్లుగా మందేసి ఇంటికి పోతున్నవాడు లైటు చూసి మా దగ్గరికి వచ్చాడు. వచ్చినోడు చూసి వెళ్లకుండా నిలబడి తాగింది దిగేదాకా మాకో క్లాసు తీసుకుని పొయ్యాడు. ఆ క్లాసు మధ్యలో బెదిరింపులు కూడా. మళ్లీ ఇలా అర్ధరాత్రి ఆటలాడుతూ కనిపిస్తే అరెస్టు చేసి లోపలేస్తానని వార్నింగు.

ఇలాంటివి చాలా జరిగిన తర్వాత, రాత్రి ఎలా అయినా తిరగడానికి మాకు ధైర్యం వచ్చింది. అలాగే మేము ఎంత తిరిగినా పట్టిచ్చుకోకుండా వుండడానికి పోలీసులకూ ధైర్యం వచ్చింది. ఆర్ధ రాత్రి ఒక కుర్రాడు రోడ్డు మీద తిరుగుతున్నాడు అంటే, పోలీసులు ఆపేవాల్లు కాదు. వాడు ఇంజినీరింగ్ కాలేజీ స్టుడెంటు అని ఫిక్స్ అయిపొయ్యేవాల్లు. ఎప్పుడైనా ఎవరినైనా ఆపి అడిగినా వాళ్లకి ఒకటే సమాధానం వుండేది. "రేపు ఎగ్జాం వుంది, ఫ్రెండు రూములో కంబైండ్ స్టడీ చేసుకుని వెలుతున్నా" అని. ఈ ఏడాది పొడుగూతా ఏం ఎగ్జాములురా అని వాళ్లకి ఎప్పుడూ డౌటు రాలేదో, లేక ఏదో ఒక ఆన్సర్ వచ్చింది కదా అని వూరుకునేవాల్లో తెలీదు. వాళ్లకి ఎం తెలిసిందో కానీ, నేను ఏదో రాద్దామనుకుని మొదలుపెట్టి ఏదో రాసినట్టున్నా. ఎటు నుంచి ఎటు వెలుథున్నానో నాకైతే తెలీట్లేదు.

18 మార్చి, 2010

ప్రాజెక్ట్ పదనిసలు

నేను, మా గల్లీ గాడు (అది మేము వాడికి పెట్టుకున్న ముద్దు పేరు) చచ్చీ చెడీ అష్టకష్టాలూ పడి ఇంజినీరింగ్ చివరి ఏడు కి చేరామా... అని సంతోషిస్తూ 7వ సెమిస్టర్ పరీక్షలు రాసాం. ఇంకొక మూడునెల్లు మనవి కాదనుకొని కష్టపడితే ఆ డిగ్రీ ఏదో చేతిలో పడుతుంది అని ఆనందపడుతూ సెలవులకి ఇంటికివెళ్లా. మా గల్లీగాడు లోకలోడే కాబట్టి వానికి పెద్దగా తేడా ఎమీ పడలేదు లెండి. కానీ వాడే పెద్ద తేడా మనిషి. అందుకే వానికి ఆ పేరు. మా బట్టతల HOD గాడేమో (క్షమించాలి. అలా అలవాటైపోయిన ప్రాణం) 7వ సెమిస్టర్ చివరి పరీక్ష రోజే ప్రాజెక్ట్ సినాప్సిస్ ఇచ్చేయాలని చెప్పాడు. మనకేమో చివరిక్షణంలో ఎవరో ఒకరు గుర్తు చేస్తే తప్ప డెడ్‌లైన్‌లు గుర్తుండని ప్రాణమాయె. చివరి ఎగ్జాం తర్వాత ఎవడో వాని ప్రాజెక్ట్ గురించి చెబుతోంటే నాకు మా ప్రాజెక్ట్ విషయం గుర్తొచ్చి, రూంకి పరిగెత్తుకొచ్చి సినాప్సిస్ రాయడం మొదలుపెట్టా.

మా గల్లీ గాడి పుణ్యమా అని, ఏదో రిఫరెన్సు దొరికి మాకు ఇద్దరికి L&T లో ప్రాజెక్టు దొరికింది. ప్రాజెక్టు వచ్చిన రోజు వెల్లి గైడ్ ని కలవమంటే మేమిద్దరం కి వెళ్లాం. ఆ గైడ్ అక్కడ ఒక డిపార్ట్‌మెంట్‌కి వైస్ ప్రెసిడెంట్ అని మాకు అక్కడికి వెళ్లాక తెలిసింది. పాపం, వయసులో పెద్దాయన కానీ, చాలా కష్టపడేవాడు. మాకు ప్రాజెక్టు గురించి ఏదో కొద్దిగా చెప్పాడు. నేను కష్టపడి దాన్ని గుర్తు చేసుకుని సినాప్సిస్ రెడీ అనిపించా. అది ప్రింట్ తీయించి HOD కి ఇవ్వరా అని మావాడికి చెప్పి నేను బెంగుళూర్‌కి బస్సెక్కా.

ఓ నెల రోజులు ఇంట్లో పండగ చేసుకుని మైసూరుకి వచ్చేసరికి మా గల్లీ గాడు మంగుళూరులో పండగ చేసుకోడానికి వెళ్లాడు. ఎలాగూ వాడు లేడు కదా అని నేను ఓ రెండు రోజులు ఇటు కాలేజీకి, అటు ప్రాజెక్టు కి వెళ్లకుండా రూంలో తొంగున్నా. అప్పుడు తగిలింది, నాకొక పెద్ద షాక్. ఒక క్లాస్‌మేట్ ఒకడు రూంకి వచ్చి ముసలోడు గరం మీదున్నాడు. మీ ప్రాజెక్టు వొప్పుకోడంట అని బాంబు పేల్చాడు. కాలేజీకి వెళ్లి చూస్తే వాడేమో ఇంకా సినాప్సిస్ ఇవ్వలేదూ అంటాడు.(నిజం చెప్పాలంటే, ఆ మాట వినేదాకా నేను వెళ్లేముందు అది రెడీ చేసానన్న విషయం మరిచిపొయ్యా) బయటికొచ్చి మావాడికి ఫోన్ చేస్తే వాడు చావు కబురు చల్లగా చెప్పాడు - "నేను వెళ్లేసరికి బట్టతలోడు చాయ్ తాగడానికి పొయ్యాడు. ఎంతసేపు ఎదురు చూస్తాం, మళ్లీ ఇద్దాం లే అని ల్యాబ్ అటెండర్ బీరువాలో పెట్టి వచ్చేసా" అని. ఏదోలా మా ముసలోడి కాల్లుగడ్డాలూ పట్టుకొని, ఆరోజు సినాప్సిస్ ఇచ్చేసి ప్రాజెక్ట్‌కి ఓకే అనిపించుకున్నా.

L&T లో మా ప్రాజెక్ట్ గైడ్ గురించి చెప్పా కదా, ఆయన ఎప్పుడు చూసినా ఫుల్ బిజీగా వుండేవాడు. ఆయన్ని కలవాలీ అంటే, ముందుగా అపాయింట్‌మెంట్ తీసుకుని పోవాలి. అదికూడా ఒక టీం కి వారంలో ఒకేసారి ఇచ్చేవాడు. ఒక వారంలో ఇచ్చిన పనిలో చిన్న డౌట్ వచ్చినా కూడా మళ్లీ వారం దాకా ఆగాల్సిందే. అలాంటి సమయంలో ఒకసారి మేము వరుసగా రెండు వారాలు అసలు అపాయింట్‌మెంట్ గురించే ఆలోచించలేదు. సడెన్‌గా ఒకరోజు మా ముసలోడు ప్రాజెక్ట్ స్టేటస్ అడిగితే అప్పుడు అపాయింట్‌మెంట్ గురించి గుర్తొచ్చింది. బేసిక్‌గా నేనొక సోంబేరి వెదవని కాబట్టి ఆ పని మా గల్లీగానికి అప్పజెప్పా. కానీ మావాని గురించి తెలుసు కదా... వాడు రెండు రోజుల తర్వాత ఫోన్ చేసి "అపాయింట్‌మెంట్ దొరికింది. రేపు పొద్దున మా ఇంటికి వచ్చెయ్, ఇద్దరం కలిసి వెళ్దాం" అన్నాడు. నేను హుషారుగా మరుసటి రోజు వెళ్లా. తీరా దగ్గర బ్నడి ఆపాక మావాడు బాంబు పేల్చాడు నేను అపాయింట్‌మెంట్ తీసుకోలేదూ అని. ఇప్పటికైనా మించింది లేదు, ఇంటికి వెళ్లి మళ్లీ రేపు అపాయింట్‌మెంట్ తీస్కొని వద్దామురా అని నెత్తి నోరు కొట్టుకున్నా. అయినా వాడు వినకుండా నన్ను లోపలికి లాక్కెళ్లాడు.

BP ఎలా వుంటుందో ఆ రోజు చాలా దగ్గరినుంచి చూసా. చెప్పాపెట్టకుండా వచ్చామని మొత్తం ఫ్లోర్ అంతా వినపడేలా అరుపులు. మాకు ఆరోజు అర్థం అయ్యింది, అన్ని రోజులు మేము ప్రాజెక్ట్‌లో ఎన్ని తప్పులు చెసామో...!!! ఆయనుకున్న ఓపిక కూడా మాకు అప్పుడే తెలిసింది, ఆ తప్పులను ఆయన ఎలా కరెక్ట్ చేయించారో ఆలోచించాక. ఆతరువాత, మళ్లీ మేము అపాయింట్‌మెంట్ తీసుకోకుండా ఆయన దగ్గరికి వెల్లలేదు. తప్పులు కూడా చెయ్యలేదు. ఫోన్ చెయ్యడానికి ముందే మేము చేసిన పని ఒకటికి రెండూ సార్లు క్రాస్‌చెక్ చేసుకుని అపాయింట్‌మెంట్ తీసుకునేవాళ్లం.

మొత్తానికి ప్రాజెక్ట్ ఒడగొట్టాం. ఫైనల్‌గా సర్టిఫికేట్ ఇచ్చేరోజు మాత్రం మేము అనుకున్నదానికి పూర్తి భిన్నంగా జరిగింది. మమ్ములని కూర్చోబెట్టి లైఫ్ ని ఎంత సీరియస్‌గా తీసుకోవాలో, ప్రాధాన్యతా క్రమాలు ఎలా నిర్ణయించుకోవాలో చెప్పారు. ఇంజినీరింగ్ స్టుడెంట్ లైఫ్‌కి, ఇంజినీర్ లైఫ్‌కి తేడా ఏంటో చెప్పారు. ఫైనల్‌గా ఒక కాఫీ పోసి పంపారు. ఇదీ క్లుప్తంగా మా ప్రాజెక్ట్ కథ. ఏదో చెప్పాలనుకుని మొదలు పెట్టా, ఏదో చెప్పి ముగించేస్తున్నా. మిగిలిన విషయాలు మల్లెప్పుడైనా చెప్పుకుందాం.

16 మార్చి, 2010

ఉగాది శుభాకాంక్షలు

వికృతి నామ సంవత్సరాది ఉగాది శుభాకాంక్షలు.

ఏమిటో, ఇన్ని రోజులు ఉగాది వచ్చినప్పుడల్లా ఏదో ఒక నోరు తిరగని పేరు చెప్పేవారు. ఈసారి మాత్రం, చిన్నప్పుడు తెలుగు క్లాస్‌లో నేర్చుకున్న ప్రకృతి కి వున్న "వికృతి" పేరు రావడం కొంత ఈజీ. కాకపోతే, పేరులో కొంత నెగెటివ్ టచ్ వుంది. అది, సాయంత్రం జరిగే పంచాంగ శ్రవణం లో వుండదని ఆశిద్దాం.

ఈ ఉగాది నుంచి వచ్చే ఉగాది వరకు అందరూ సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు, ధనధాన్యాలు మరియు ఐశ్వర్యాభివృద్ది పొందాలని కోరుకుంటూ... మరోసారి, ఉగాది శుభాకాంక్షలు.

15 మార్చి, 2010

తెలివి-అతితెలివి

మా సూరీడు చాలా తెలివైనోడు. ఒక్క తెలివైనోడే కాదు... బాగా లోకజ్ఞాణం వున్నోడు. మేధావి కూడా. వాడు ఎలాంటివాడంటే, వాడు లేకుంటే మా కాలేజ్‌డే ఫంక్షన్ కి స్టేజీ పనులు కాదు కదా, కనీసం ప్రోగ్రాములు చేసేవాళ్ల లిస్టు కూడా రెడీ కాదు. అంతలా అన్ని పనులూ నెత్తినేసుకుని చూసుకునేవాడు. సమాజసేవ అంటే వానికి పిచ్చి. చదువులో టాపర్(సరస్వతీదేవి దయవల్ల మావాడు లెక్కలని కూడా భట్టీయం వేయగలిగేవాడు). అంతెందుకు, అసలు 35 ఏళ్ల టీచింగ్ కెరీర్‌లో మా కాలేజ్ ప్రిన్సిపాల్ అలాంటి స్టుడెంటుని అంతకు ముందు చూల్లేదు. (నిజ్జ్యొం. కావాలంటే వాడు అమెరికాలో ఎమ్మెస్ చెయ్యడానికి అక్కడి యూనివర్సిటీ కి పంపిన SOP చూడండి. కింద, మా ప్రిన్సిపాల్ సంతకం, స్టాంపుతో సహా వుంటుంది.)

వానికి ఇంత టాలెంట్ ఎలా వచ్చిందా అని ఆలోచిస్తున్నారా.....? కష్టపడకండి. నేను చెబుతా. వాడు 1వ క్లాసులో రేడియో విప్పి చూసాడు. 3వ క్లాసులో టెలివిజన్ సెట్టు కూడా విప్పేసాడు. (నిజ్జ్యొం, ఇది కూడా SOP లోనే చూసా). మావాడు జీవితంలో సాధించిన మొదటి ఘనత, 5వ క్లాసులో కంప్యూటర్ ని విప్పడం. (బహుశా, ఇక్కడే దొరికాడనుకుంటా. లేకపోతే, 1990లో పిల్లలు పీకి పందిరేసేటన్ని కంప్యూటర్లు ఇండియా లో వున్నాయా అని). ఇంతటి మేధావి కాబట్టే, ఇంజినీరింగ్ ఆఖరిఏడు లోకి రాకముందే భవిష్యత్తుకు దిశానిర్దేశం కానిచ్చాడు. అమెరికా లొ ఎమ్మెస్ చేసి, వీలయితే పీ హెచ్ డీ చేసి, వానంత తెలివి వున్న వాళ్లందరినీ అక్కడికే లాగేసుకుని, ఆ పాప్యులారిటీ తో అక్కడే రాజకీయాల్లోకి దిగి, ఏ సెనేటరో అయిపోయి ఇక్కడి ఈనాడు పేపర్లో పడాలని ప్లాన్ చేసాడు. కానీ, పాపం. వీడు అప్లై చేసుకున్న ఏదో యూనివర్సిటీ వాడు మనవాడి అతితెలివిని పట్టేసాడు. పెట్టేసినోడు పట్టేసినట్టు వూరికే వుండకుండా, ఏదో ఘనకార్యం చేసినవాడిలా ఇందులో నిజమెంత అంటూ మా ప్రిన్సిపాల్ కి ఓ లెట్టర్ రాసి పడేసాడు. ఇక్కడే, పాపం, మా వాడి (డామిట్)కథ అడ్డం తిరిగింది. ఇంకేముంది... కాలేజీ ప్రిన్సిపాల్ పుణ్యమా అని, దేశం దాటి పోవాల్సిన ఒక అతితెలివి మేధావి ఇంజినీరింగ్ పూర్తయితే చాలు అని వీసా ప్రయత్నాలు ఆపేసాడు.

బోస్టన్ లో సెనేటర్ కలలు కన్న ఒక యువకిషోరం, బెంగుళూరులో సాఫ్ట్‌వేరులో సెట్టిల్ అయ్యాడు. దేశంలో అతితెలివిపరుల కౌంటు ఒకటి పెరిగింది.

11 మార్చి, 2010

చిరంజీవి Vs పవన్ కళ్యాణ్

మా బ్యాచ్‌లో వున్న 20 మందిమి కలిసి ప్రతి 2 నెలలకొకసారి పార్టీ చేసుకునేవాళ్లం. ఆ మధ్యలో పుట్టినరోజు వచ్చినవాళ్లు ఆ పార్టీ కి స్పాన్సర్స్ అన్నమాట.(అఫ్‌కోర్స్, ఎంత స్పాన్సర్ అనే మాట వాడినా, పార్టీ ఇచ్చిన వాళ్లకి గిఫ్ట్‌లు పోయేవి లెండి.) మేమున్న లేఅవుట్ నుంచి 20 కిలోమీటర్ల దూరంలో బెంగళూరు రోడ్‌లో పల్లవి ధాబా అని వుండేది. అదే మాకు పార్టీ స్పాట్. మేము ఇరవై మందిమి వెళ్లేవాళ్లం. పార్టీ మొదలైన దగ్గరినుంచి అయిపోయేవరకు మా గొంతులు పోయేలా అరుచుకోవడానికీ, కొట్టుకోవడానికీ మాకు ఒక టాపిక్ కావాలి. అదేమిటో గానీ, ప్రతీసారీ ఒకే టాపిక్ వచ్చేది. అదే చిరంజీవి Vs పవన్ కళ్యాణ్. ఈ ఇద్దరిలో ఎవరు గొప్ప అను మేము కొట్టుకునేవాళ్లం. వాల్లు మాత్రం బాగానే వున్నారు, అది వేరే విషయం. ఇప్పటికే మీకు ఒక డౌటు వచ్చింటుంది... మేము ఎంత వెదవలం కాకపోతే ఈ టాపిక్ పెట్టుకుంటాం అని... కాని పార్టీ అన్నాక వాదులాట వుండాలి కాబట్టి ఏదో ఒకటి అని స్టార్ట్ చేసేవాళ్లం. ఇక్కడ ఒక విషయం చెప్పాలి. మా ఇరవై మందిలో 17 మంది చిరంజీవి ఫ్యాన్స్.(వీల్లలో కొందరు బాలకృష్న ఫ్యాన్స్ కూడా వున్నారు, కాని ఆ టైంలో చిరంజీవి ఫ్యాన్స్ అవతారం ఎత్తేవాళ్లు. వీళ్ల గురించి మళ్లీ మాట్లాడుకుందాం.) ఒకడు రజనీకాంత్ ఫ్యాన్, ఇంకొకడు నాగార్జున ఫ్యాన్. మిగిలిన ఒక్కడు మాత్రం పవన్ కళ్యాణ్ ఫ్యాన్... యస్స్, మీరు కరెక్టే. నేను అప్పట్లో పవన్ కళ్యాణ్ ఫ్యాన్‌ని.

చెప్పాలంటే మొదట్లో నేను పవర్‌స్టార్‌కు అంత పెద్ద ఫ్యాన్ ను కాదు. కాని, నేను హైదరాబాద్ లో లాంగ్ టరం చేసే రోజుల్లో సంధ్య థియేటర్ మీద చేసిన దాడుల గురించి తెలిసిన మిత్రులంతా కలిసి నన్ను పవన్ కళ్యాణ్ కు వీరాభిమానిని చేసేసారు. మొదట్లో నాకు చిరంజీవి అంటే ఇంత వ్యతిరేకత లేదు. ఎక్కడో ఒక మూల కొద్దిగా ఇష్ఠం వుండేది అనుకుంటా. కానీ రెండు విషయాలు నాలో చిరంజీవి అంటే వ్యతిరేకతను పెంచాయి.

1. ఇది ఎంతవరకు నిజం అనేది నాకు తెలియదు కానీ, అప్పట్లో ఏదో మ్యాగజైన్ లో చదివాను. "అన్నయ్య" వంద రోజుల ఫంక్షన్లో చిరంజీవి మట్లాడితూ "ఈ సినిమా వేరే వాల్లు చేసుంటే ఇన్ని రోజులు ఆడేది కాదు... ఒక 50 రోజుల సినిమా. కానీ నేను చెసిన సినిమా కబట్టి 75 రోజులు ఆడుతుంది అనుకున్నా. కానీ ఫ్యాన్స్ ఆడించడం వల్ల 100 రోజులు ఆడింది....." అంటూ ఇంకా చాలా మాట్లాడినట్టు చదివా. అది చదవగానే, రెకార్దుల కోసం అలా ఆడించడం వెనుక చిరంజీవి ఎంకరేజ్‌మెంట్ వుంది అని నాకు అర్థం అయ్యింది. నేను తప్పుగా అర్థం చేసుకుని వుండవచ్చు, కానీ అప్పుడే నాకు చిరంజీవి అంటే వున్న కొద్ది ఇష్ఠం కాస్తా పొయ్యింది.

2. ఇంద్ర సినిమా. సినిమా బాలేదు అని నేను అనను. కానీ చిరంజీవి ఆ సినిమా చెయ్యకూడదు అనేది నా వాదన. అప్పటికే చిరంజీవికి వున్న క్రేజ్, స్టార్‌డం చూసుకుంటే ట్రెండ్‌సెట్టర్ సినిమాలు తీయాల్సిన చిరు హిట్ కోసం ఆల్రెడీ సెట్ అయివున్న ఫాక్షన్ అనే ట్రెండ్ ఫాల్లో అయ్యాడు. ఆ ట్రెండ్ కూడా అప్పుడు అదే రేంజ్‌లో వున్న బాలకృష్ణ సెట్ చేసింది. ఇన్ని సంవత్సరాల స్టార్‌డం, మాస్ అభిమానగణం వుండి, కలెక్షన్ల పరంగా తెలుగు సినిమా స్టామినా మార్చిన హీరోగా పేరుండి, కేవలం ఒక్క హిట్ కోసం వేరొకరు సెట్ చేసిన ట్రెండ్‌లో వెల్లడం తప్పు అని నా వాదన.

ఈ రెండు విషయాలను పక్కన పెడితే, మా చిరు Vs పవన్ గొడవల్లో చాలా పాయింట్లు వచ్చేవి. ఏ పార్టీ అయినా చివరకు గొడవ మాత్రం ధాభా వాడు మమ్మల్ని వెళ్లిపొమ్మనేంతవరకూ జరిగేవి. ఆ మధ్యలో కోపాలకు పోయి ఆవేశంతో కొట్టుకోవడాలూ, బాటిల్సు పగులగొట్టి ఒకరి మీదకి ఒకరు పరుగు తీయడాలు.... అదో వింత సరదా. ఈ మధ్యలో ఇద్దరు మాత్రం ఈ గొడవేది పట్టనట్టు వేరే పని మీద వుండేవాళ్లు. వాల్ల పని అంతా మా దగ్గర ఆర్డర్ తీస్కోవడం, ధాభా వానికి ఇవ్వడం... మళ్లీ ఆర్దర్ ఇచ్చినవన్నీ వచ్చాయో లేదో చూసుకోవడం. ఇదంతా ఇప్పుడు గుర్తుచేసుకోగలనే కానీ మళ్లీ సీన్ రిపీట్ అయ్యే ఛాన్స్ అయితే లేదు. ఎందుకంటే, ఇప్పుదు మల్లీ ఆ ఇరవై మందీ కలవరు. ఒకవేళ సగం మంది కలిసి వెళ్లినా, ఆ అన్నదమ్ముల గొడవలెందుకురా టైం వేస్టూ అని కన్‌క్లూడ్ చేసుకుని, పెళ్లి అయినవాల్లంతా కలిసి బ్యచిలర్ల బుర్ర తినే ప్రోగ్రాం పెడతారు. ఇక్కడ వాల్ల తప్పు కూడా లేదు లెండి. వాల్ల వాదన కూడా కరెక్టే. "Happyness is not the only virtue in life" అని చెప్పి, కష్టాల కడలిని ఈదడానికి తోడు రమ్మంటారు..... అతితెలివి అంకుల్సు.

10 మార్చి, 2010

పరిచయం

నేను ఇంజినీరింగ్ మైసూర్ లో చేసాను. మా కాలేజీ ఊరి అవతల వుండేది. మేము వున్న లేఅవుట్ అప్పట్లో మైసూరు కు చివరి సెంటరు. ఆ ఏరియా దాటితే అంతా చెట్లు పుట్టలతో వుండేది. మా బ్యాచ్ లో 20 మందిమి తెలుగు వాళ్లం. రెండు ప్రైవేట్ హాస్టల్స్ లో అందరం వుండేవాళ్లం. ఆ 20 మందిలో ఎక్కువ మందికి ముందే హాస్టల్ జీవితం అలవాటు. నాలాంటి ఒక ఐదారుగురికి మాత్రం అది కొత్త.

రెండు విషయాల్లో మాత్రం అక్కడ అందరికీ కొత్తే. ఒకటి భాష అయితే రెండోది స్వాతంత్ర్యం. చాలా మంది ఇంటర్ హాస్టల్లో చదివినా కూడా అక్కడ ఎంత స్వాతంత్ర్యం వుంటుందో అందరికీ తెలిసిందే. ఈ రెండు విషయాలే మా అందరినీ బాగా దగ్గర చేసాయి. ఇంజినీరింగ్ అయిపోయి దాదాపు ఏడేళ్లు అయినా కూడా ఇప్పటికీ ఒక పది మందిమి రెగులర్ గా టచ్ లో వున్నాం. ఏ ఒకేషన్ వచ్చినా ఇప్పటికీ ఆ పది మందిమి మాత్రం తప్పకుండా కలుసుకుంటాం. అన్నీ ఒక వరుసలో కాకపోయినా, గత పదేళ్లలో మా మధ్య జరిగిన సరదా సంగతులు, మేం పంచుకున్న మధురానుభూతులు ఈ లేబుల్ కింద పోస్టు చేస్తాను.

సరదాగా సాగిన జీవితాన్ని మరింత సరదాగా గుర్తు చేసుకుందాం... మెల్లమెల్లగా, కొద్దికొద్దిగా.... కానీ మొత్తంగా!!!

09 మార్చి, 2010

పరువు పోయింది

అవును. పరువు పోయింది. విద్యాధికులు, మేధావులతో నిండి వుండే పెద్దల సభగా చెప్పుకోబడే ఎగువ సభ (రాజ్య సభ) పరువు పోయింది. పరోక్ష ఎన్నికలు, వాటి వల్ల వచ్చే పదవులు రాజకీయ ఉద్యోగాలు సృష్టంచడానికేనని రాజకీయ పక్షాలు మరోసారి నిరూపించాయి. ఈ మాట నిరూపించుకునే ప్రయత్నం లో మన గౌరవనీయులైన సిగ్గు లేని రాజకీయ వుద్యోగులు అంతర్జాతీయ అవనిక పై భారతావనికి ఒక మాయని మచ్చను అంటగట్టారు.

మహిళా దినోత్సవం రోజున మహిళా బిల్లును ప్రవేశపెట్టే సమయంలో పెద్దల సభలో కొందరు పెద్దలు ప్రవర్తించిన తీరు కేవలం ఆ సభ పరువునే కాదు, మొత్తం భారతీయ పార్లమెంటరీ వ్యవస్థ పరువునే మంట గలిపేసింది. ఈ తరహా విన్యాసాలు దిగువ సభలో జరిగితే ఇంతగా ఆలోచించేవాల్లం కాదు. ఎందుకంటే, వాళ్లు ప్రత్యక్ష ఎన్నికల్లో గెలిచిన మన ప్రతినిధులు. వీళ్లు మైకులు విరగ్గొట్టకుండా, బిల్లు పేపర్లు చించేయకుండా ప్రశాంతంగా చర్చిస్తే ఆ తర్వాతి ఎన్నికల్లో మళ్లీ మనం ఓట్లేస్తామా...? అస్సలు వెయ్యం. ఆ విషయం వాళ్లకు కూడా తెలుసు. అందుకే వాళ్లు అలా చేస్తారు. మనం చూస్తాం. మనం అలా అడ్జస్ట్ అయిపొయ్యాం. కాని, పెద్దల సభ అంటే, ఇప్పటికి నాలాంటి అమాయకులకి ఎక్కడో కొద్దిగా నమ్మకం మిగిలింది. రాజ్యసభ అంటే పెద్దరికానికీ, హుందాతనానికీ ప్రతినిధిగా వుండాలనీ, వుంటుందనీ జనాల్లో వున్న నమ్మకాన్ని ఈరోజు మన రాజకీయ పార్టీల పుణ్యమా అని మన రాజకీయ వుద్యోగులు మానభంగం చేసేసారు.

పొలిటికల్ ఎంప్లాయ్‌మెంట్ పేరు మీద రాజ్యసభను మరో లోక్‌సభ చేసిన పార్టీల తప్పా, లేక రాజ్యసభ విలువ తెలియకుండా వెళ్లి దాని పరువు తీసిన సభ్యుల తప్పా అని ఆలోచిస్తే.... నాకు తట్టిన ఆలోచన మాత్రం ఇది ముమ్మాటికీ పార్టీల తప్పే. ఫ్రజాబలం లేకో, మరేదో కారణం వళ్లో ప్రత్యక్ష ఎన్నికల ద్వారా ప్రజాసేవకు నోచుకోని మేధావి వర్గం సేవలను ప్రజాసేవకు వినియోగించుకోవాలనే సదుద్దేశం తో మన రాజ్యాంగం నెలకొల్పిన విధానమే రాజ్యసభ. ఆ సభ విలువ తెలియనివాళ్లనీ, ఆ సభలో సభ్యత్వం పొందే అర్హత లేనివాల్లనీ కేవలం డబ్బు కోసమో లేక పార్టీ ఫండ్ కోసమో లేక మరేదో ప్రయోజనం ఆశించో రాజ్యసభకు పంపిన పార్టీలదే ఇక్కడ తప్పు.

గతాన్ని చూస్తే, ఈ సభ తన మర్యాదను ఏనాడూ ఇలా పోగొట్టుకోలేదు. ఇంకా చెప్పాలంటే, గత ప్రభుత్వాలు దాని ప్రతిష్ఠను పెంచాయి. దానికి స్వచ్చమైన ఉదాహరణ మన జాతీయ విత్త మంత్రివర్యులు శ్రీ ప్రణబ్ ముఖర్జీ గారు. ప్రణబ్ రాజకీయ జీవితాన్ని పరికిస్తే, 1969-1987 మరియు 1993-2004 మధ్య కాలంలో రాజ్యసభ సభ్యునిగా సేవ చేసారు. చాలా మంది ఈయనని సోనియా కోటరీగానే అనుకుంటారు. కానీ, చాలా మందికి తెలియని విషయం ఒకటుంది. 1982-84 మధ్య కాలంలో కూడా ఈయనే మనకు విత్తమంత్రి. ఆ సమయంలో, అంటే, 1984 లో "యూరోమనీ" అనే పత్రిక వారు ప్రణబ్ ని ప్రపంచంలో అత్యుత్తమ ఆర్థిక మంత్రిగా ప్రకటించి గౌరవించారు. దానికి ఒక కారణం కూడా వుంది. 1981లో (అనుకుంటా) భారత ప్రభుత్వం అంతర్జాతీయ ద్రవ్య నిధి నుంచి తీసుకున్న అప్పులో చివరి వాయిదా అయిన 1.1 బిలియన్ డాలర్లను 1984లో తీసుకోవలసివుండగా, ఆ సమయంలో ఈయన తీసుకున్న నిర్ణయాల ఫలితంగా మన ప్రభుత్వం ఆ సొమ్మును, అనగా అప్పును, తీసుకోలేదు. ఇలాంటి మేధావుల సేవలను కోల్పోరాదనే సదుద్దేశంతో మన రాజ్యాంగం మనకిచ్చిన రాజ్యసభ అనే మహోత్తరమైన విధానానికి తిలోదకాలిస్తూ ఆ సభా మర్యాదను మంటగలిపే రౌడీరాజులను సభ్యులుగా చేసిన మతి లేని, సిగ్గు విడిచిన ముగ్గురు యాదవ కుల తిలకులకు ఇవే నా జోహార్లు.

04 మార్చి, 2010

ఆంగ్లం - సంగీతం

నేను 7వ తరగతి లో వుండగా అనుకుంటా, మంథని లో సంగీత పఠశాల స్టార్ట్ అయ్యింది. 8వ తరగతి లో వుండగా నేను, ఇంకో ఇద్దరు స్నేహితులు మ్రుదంగం క్లాసులో చేరాం. అదే సమయం లో ఇంగ్లిష్ గ్రామ్మర్ కోసం కూడా ఇంట్లో వాళ్లు మా ముగ్గురికీ ట్యూషన్ పెట్టించారు. ఇక రోజూ మాది ఒకే దినచర్య అయిపోయింది. సాయంత్రం స్కూలు నుంచి రాగానే ఇంత తినడం, తయారవడం, సైకిల్లేసుకుని బయట పడటం. ముందుగా ఇంగ్లిష్ ట్యూషన్ కి వెళ్లడం, అది అయ్యాక సంగీత పఠశాల కి వెళ్లడం. రెండూ అయ్యాక ఇంటికి చేరడం. ముందు కొన్నాల్లు బాగానే గడిచింది. తరువాతే, (డామిట్) కథ అడ్డం తిరిగింది.

ఇంగ్లిష్ ట్యూషన్ బాగానే జరిగేది. పేరు గుర్తు లేదు కానీ, ఆ పంతులు మాచేత WREN & MARTIN పుస్తకాన్ని కొనిపించి, అదే పుస్తకంలోంచి నేర్పించేవారు. ఏ మాటకామాటే చెప్పుకోవాలి గానీ, నేను ఈమాత్రం ఇంగ్లిష్ మట్లాడుతున్నానంటే అది ఆ ట్యూషన్ మహిమే. ఆ పుస్తకం అయ్యేంత వరకు మేము ముగ్గురం ఆ ట్యూషన్ కు రోజూ వెళ్లాము.(అక్కడ మేము ముగ్గురమే స్టుడెంట్సు, అది వేరే విషయం).

ఇక సంగీతం విషయానికి వస్తే, మొదట్లో అక్కడ ఒక మ్రుదంగం మాస్టారు వుండేవారు. ఆయంటే అందరికీ గౌరవం వుండేది. కానీ ఆయనకి వరంగల్ అంటే ఇష్టం వుండేది. ఆ ఇష్టం తోనే ఆయన వరంగల్ కి ట్రాన్స్ ఫర్ చేయించుకుని వెళ్లిపోయారు. అందరూ చాలా బాధ పడ్డారు. నేను కూడా!!! (తొక్కలో బాధ. నేను ఆయన దగ్గర నేర్చుకున్నది రెండు వారాలు. ఆ రెండు వారాల్లో నేర్చుకున్నది, ఒక్క పాఠం. ఈమాత్రానికే బాధ పడితే, నా లైఫ్ అంతా ట్రాజెడీ గానే వుండేది. ఏదో, పక్కనున్న వాళ్ల కోసం కొంచెం సైలెంట్ గా వున్నా.. అంతే.) కానీ, ఆయన వెళ్లాక వచ్చిన కొత్త మాస్టారు ఆ పాత మాస్టారు చెప్పిందంతా వేస్టు అని కొత్తగా చెప్పడం మొదలు పెట్టారు. కొత్త పాఠాలు ఎలా వున్నా, పాత మాస్టారు చెప్పింది వేస్టు అనేసరికి చాలా మందికి ఎక్కడో కాలింది. (నాక్కూడా కాలింది. కానీ రీజన్ మాత్రం వేరు. ఏదైనా ఒక్కసారి చెప్పగానే పట్టేసి నేర్చేసుకోవాలని ఎక్స్ పెక్ట్ చేసేవాడు. నాకు అంత తెలివి లేక రోజూ తిట్లు తినేవాన్ని. అందుకు నాకు కాలింది.)

అప్పట్లో అందరికీ ఒక అలవాటు వుండేది. క్లాస్ అయ్యాక, బయటకి వచ్చి చెప్పులు వేసుకుంటూ "వెళ్లొస్తాం మాస్టారూ" అని చెప్పేవాళ్లం. (బహుశా అది RSS వారి శిశు మందిర్ నుండి వచ్చిన అలవాటు అనుకుంటా. ఆ క్లాసులో ఎక్కువ మంది శిశు మందిర్ పూర్వ విద్యార్థులే.) ఒక రోజు అనుకోకుండా నేను రమణ గారి "బుడుగు" స్టైల్ లో "ఒరేయ్ మాస్టారూ, వెళ్లొస్తానురా" అన్నాను. అది ఆ మాస్టారి చెవిన పడింది. అంతే, ఆ మాస్టారు నన్ను చుస్తూ, ఒరేయ్, నువ్విలా రారా అన్నాడు. మెడకాయ మీద తలకాయ వున్నవాడెవడైనా వెళ్తడా...? నేను కూడా అంతే. పరుగు లంకించుకున్నాను. నా పుణ్యమా అని, నాతో వున్నందుకు నా ఫ్రెండ్సు కూడా పరుగెత్తక తప్పలేదు. మళ్లీ మూడు నెలల పాటు మేము ముగ్గురం సంగీత పఠశాల కి వెళ్లలేదు. అఫ్ కోర్స్, మూడు నెలల తర్వాత ఆ పాఠశాల ప్రిన్సిపాల్ వచ్చి మీ వాడు రావట్లేదండీ అని ఇంట్లో చెప్పాక వెళ్లక తప్పలేదు.

కానీ, లైఫ్ లో మొదటిసారి బంక్ కొట్టడం అలవాటైంది. ఆ మూడు నెలలు బంక్ కొట్టి రోజూ గ్రౌండ్ లో ఆడుకోవడం లో కూడా ఒక థ్రిల్ వుండేది.

03 మార్చి, 2010

గంగాధర్ సారు బడి

నా 6, 7, 8 తరగతుల చదువు కరీంనగర్ జిల్లా, మంథని టౌన్ లోని UPS లో జరిగింది. (ఇప్పుడు ఆ బడిని ZPP స్కూలు గా మర్చారు. అది వేరే విషయం.) అప్పట్లో ఆ స్కూలు ని UPS అనే కంటే అందరూ గంగాధర్ సార్ బడి అని పిలిచేవాల్లు. ఆయన ఆ స్కూలు కి హెడ్ మాస్టర్ గా చేసేవారు. ఆయనంటే స్కూల్లో అందరికీ హడల్. ఆ రోజుల్లో అంతగా ఎందుకు భయపడ్డామో ఇప్పటికీ నాకు అర్థం కాదు. ఎందుకంటే, ఆయన ఏనాడూ ఎవరినీ కొట్టడం నేను చూడలేదు. ఆ బడికి ఆ పేరు రావడానికి కారణం అక్కడ ఆయన ఎక్కువ కాలం పని చేసి వుండడమే. ఆయన అదే స్కూల్లో హెడ్ మాస్టర్ గా వున్నప్పుడు అక్కడ చదువుకున్న వాల్లే మళ్లీ ఆ బడికి టీచర్లుగా వచ్చి మాకు పాఠాలు చెప్పారు. దాదాపు రెండు దశాబ్దాలపాటు ఆయన అక్కడ చేసారు.

మంథని చుట్టు పక్కల వూర్లల్లో కూడా గంగాధర్ సార్ బడి అంటే ఒక పేరు వుండేది. పేరుకి సర్కారు బడి అయినా ప్రైవేటు స్కూల్లకి ఆ స్కూలు పెద్ద పోటీ. అక్కడ టీచర్లు కూడా చాలా బాగా చెప్పేవారు. నాకు గుర్తున్న కొందరు మాస్టార్ల గురించి ఇక్కడ చెప్పాలి.

గంగాధర్ సార్: హెడ్ మాస్టర్ గానే కాకుండా, ఇంగ్లిష్ కూడా చెప్పేవారు. ఆయన క్లాస్ ఎప్పుడు అయినా చాలా సైలెంట్ గా వుండేది. ఎవరూ మాట్లాడే వారు కాదు. చెప్పాను కదా, ఆయనంటే అందరికీ భయం అని.

భూమయ్య సార్: సామాజిక శాస్త్రం చెప్పేవారు. ఆటలు ఆడించేవారు. క్లాసులో క్విజ్ పెట్టేవారు. కథలు చెప్పేవారు. అన్నింటిలోనూ జీవితం గురించీ, చదువు గురించీ చెప్పేవారు. కబడ్డీ ఆడించేటప్పుడు "కబడ్డీ కబడ్డీ" అనే కూత బదులు "కెనడా రాజధాని ఒట్టావా" అనో, "కెన్యా రాజధాని నైరోబీ" అనో కూత వేయించేవారు. అలా ఆటల్లోనే చదువు కానిచ్చేవారు. ఆయన మా మీద ఎంత ప్రభావం చూపారంటే, మేము ఆడుకునే ఆటల్లో క్విజ్ కూడా ఒకటి. ఇప్పటికీ ప్రతీ ఏడాది టీచర్స్ డే రోజు నేను ఆయనకి ఫొన్ చేస్తాను.

వీరయ్య సార్: లెఖ్ఖలు చెప్పేవారు. మా క్లాసులో ఎక్కువ మంది ఇంజినీరింగ్ చేసారంటే ఆ క్రెడిట్ ఆయన చెప్పిన లెఖ్ఖలదే.

ప్రసాద్ సార్: వీరయ్య సార్ తర్వాత మాకు లెఖ్ఖలు చెప్పడానికి వచ్చారు. వీరయ్య సార్ లేని లోటు తెలియకుండా నేర్పారు. ఈయన కూడా గంగాధర్ సార్ శిష్యుడే అనుకుంటా. నేను చివరిసారిగా కలిసిన టీచర్ కూడా. (ఈమధ్యే ఒక ఫంక్షన్ లో కలిసారు.)

రామయ్య సార్: ఈయన నేను 8వ క్లాసు లో వుండగా రిటైర్ అయ్యారు. హిందీ చెప్పేవారు. ఈయన ఒక మంచి కవి కూడా. గంగాధర్ సార్ క్లాస్ ఎంత సైలెంట్ గా వుండేదో, ఈయన క్లాస్ అంత అల్లరిగా వుండేది. పాఠాలను కూడా కథలుగా చెప్పేవారు. ఎవరు అల్లరి ఎక్కువ చేసినా, "వీని లాంటి వాడే ఒకడు...." అంటూ ఒక కథ చెప్పేవారు. ఈయన క్లాసులో అందరూ ఒక వరుసలో కాకుండా ఎవరికి ఇష్ట్టం వచ్చినట్టు వారు గుంపులు గుంపులు గా కూర్చునేవాల్లం. ఒక గుంపు అల్లరి చేస్తే, ఇంకొక గుంపుకు దెబ్బలు పడేవి. ఆ దెబ్బలని కూడా మేము ఎంజాయ్ చేసేవాల్లం.

02 మార్చి, 2010

తొలి టపా

ఇది నా తొలి టపా. కొన్ని తెలుగులొ వస్తున్న బ్లాగులను చూసి ఇన్ స్పిరేషన్ తో మొదలుపెట్టాను. ఎన్ని రొజులపాటు దీన్ని కంటిన్యూ చేస్తానో కాలమే నిర్ణయిస్తుంది.

ఇందులో నా గతం, వర్తమానం మరియు అందులోని మధుర జ్ఞ్యాపకాలను పొందు పర్చుకోవాలని నా ఆలోచన. వాటితో పాటు, అందరితో పంచుకోవాలనుకునే కొన్ని ఆలోచనలు.

నాలో ఒక కవి కానీ, భావుకుడు కానీ లేడని నా ప్రగాఢ నమ్మకం. అందుకే, నా తెలుగు లో తప్పులు దొర్లితే సరిదిద్దమని తెలుగు ప్రేమికులకు మనవి.

సరైన శీర్షిక తో త్వరలొనే మళ్లీ వస్తా.