మేము ఇంజినీరింగ్లో చేరాక, ఫస్ట్ సెమిస్టర్లోనే కొందరికి బండ్లు వచ్చాయి. సెకండ్ సెమిస్టర్కి వచ్చేసరికి బండ్లు పెరిగాయి. అదిగో, అప్పుడు అనుకున్నాం... అందరం కలిసి ఒకసారి బండ్లమీద ఊటీ వెళ్లి వద్దాం అని. అలా అనుకుంటూనే రోజులు గడిచిపోయాయి. రోజులు నెలలు, నెలలు ఏళ్లు అయ్యాయి. రెండేళ్లు గడిచాక, ఒక హోళీనాడు అందరం సరదాగా హోళీ ఆడుకున్నాం. ఏం సరదానో ఏమో, హోళీ అన్న విషయం మరిచిపోయి పొద్దెక్కేదాకా పడుకున్నందుకు, లేపుకొచ్చి నెత్తి మీద గుడ్డు కొట్టి కిందనుంచి మన్ను తీసి పోసారు... దుమ్మంతా తలలోంచి పోవడానికి గంట కష్టపడి మూడు శాంపూ సాచెట్లు అరగదీస్తే కానీ దారికి రాలేదు. అది పక్కన పెడితే, అలా ఆడుకుని స్నానాలు అయ్యాక అందరం కలిసి లంచ్ కి వెళ్లేముందు అలవాటు ప్రకారం ఒకచోట కలుసుకున్నాం. అక్కడినుంచి మెస్కి పోతుండగా ఎవడో అన్నాడు.. ఎటైనా ట్రిప్ వేద్దామురా అని... అక్కడ మొదలైంది, మా పరిశోధన. భోంచేసి వచ్చి అందరం కలిసి ఒక గ్రూప్ డిస్కషన్ పెట్టుకున్నాం, ఎక్కడికి వెళ్దాం అని. మొదలు మైసూరుకు 80 కిలోమీటర్ల దూరంలో వున్న గోపాలస్వామి బిట్ట అనుకున్నాం. చూస్తే మంది ఎక్కువ, బండ్లు తక్కువ వున్నాయి. సరే, కొందరు ఏ సుమోనో క్వాలిసో మాట్లాడుకుని పోతే సరిపోద్ది అనుకున్నాం. అంతలో మా రూమ్మేటు కొందరు బండ్లమీద, ఇంకొందరు కార్లో పోవడం ఏంటి, పోతే అందరం ఏ స్వరాజ్ మజ్దానో పట్టుకుపోతే సరిపోద్ది కదా అన్నాడు. ఆ పెద్ద బండేదో మట్లాడుకునేటట్టయితే, ఈ బిట్ట దాకానే ఎందుకు, ఇంకొచం ముందుకు పొయ్యొద్దాం అనుకున్నాం. అలా ప్లాన్ చేసి, మరుసటి రోజు పొద్దున్నే అందరం కలిసి ఊటీ, కొడైకనాల్ చూసొద్దామని బయలుదేరాం.
మాకు దొరికిన డ్రైవర్ పేరు మైఖేల్ షుమేకర్ (అది మేము పెట్టిన పేరు). వాడు పొద్దున మైసూర్నుండి బయలుదేరి, 135 కిలోమీటర్ల దూరంలో వున్న ఊటీ కి తీసుకెళ్లడానికి 6 గంటల పైనే తీసుకున్నాడు. టైం తీసుకున్నాకూడా ఆ జర్నీని మేము బాగా ఎంజాయ్ చేసాం. ఎప్పుడో చూసిన తిరుపతి ఘాట్రోడ్డు, ఎప్పుడూ తిరిగిన చాముండి బిట్ట రోడ్డు తప్ప పెద్దగా ఘాట్రోడ్డులు తెలీని మాకు, ఒక్కసారిగా అంతపెద్ద కొండలు, మలుపులు తిరుగుతూ వెళ్లే రొడ్డు, దానికి తోడు చుట్టూ టీ తోటలు.. స్వర్గం కల్లముందు వున్నట్టు అనిపించింది. అలా ఎంజాయ్ చేస్తూ డైరెక్టుగా ఊటీలో దొడ్డబిట్ట కి వెళ్లిపోయాం. అక్కడ చూస్తే ఏముంది... మేఘాల పైన మేమున్నాం. గాళ్లో తేలిపోవడమంటే ఇదేనేమో అనిపించింది. దానికి తోడు, అప్పుడు అక్కడ చిన్నగా వాన, చలి. మొదలు చూస్తే అక్కడంతా ఫ్రెష్ క్యారట్, మసాలా అద్దిన శెనగలు గట్రా అమ్ముతున్న కౌంటర్లు కనిపించాయి. కానీ, టికెట్టు కొని పీక్పాయింటు చూద్దామని వెళ్తే అక్కడ ఒకడు చాకోబార్లు అమ్ముతున్నాడు. ముందు వాన్ని చూసి, ఇక్కడ ఐస్క్రీములెవడు తింటాడురా పిచ్చిప్యూన్ అనుకున్నా. విధి వక్రించి ఎవడో తింటూ కనిపించాడు. జిహ్వచాపల్యం వూరుకుంటుందా, నాకూ కావాలని గోల చేసింది. తప్పదనుకొని కొన్నా. ఆ చలిలో ఆ చాకోబార్... కేక. ఇప్పటికీ ఎవరైనా ఊటీ వెళ్తున్నామని చెప్తే వాళ్లకి నేను దొడ్డబిట్ట దగ్గర చాకోబార్ తినమని సలహా ఇస్తా. అంతలా నచ్చింది. దొడ్డబిట్ట తర్వాత ఊటీలో పెద్దగా పొడిచిందేమీ లేదు గానీ, ఆరోజు సాయంత్రం ఊటీ నుంచి కూనూర్ వరకూ టాయ్ట్రెయిన్లో ప్రయాణం మాత్రం అద్భుతం. ఆ తరువాత నేను ఊటీకి వెళ్లిన ప్రతీసారీ ఆ టాయ్ట్రెయిన్ ప్రయాణం చేస్తూనేవున్నా.
కూనూర్లో దిగాక మా మొదటి పని, రూము వెతుక్కోవడం. రూం వెతుక్కోవడం అనే కార్యక్రమం పూర్తి అయ్యేలోపే మా వాళ్లు అసలు కార్యక్రమానికి ప్రిపేర్ అయ్యారు. అదేదో రూం కోసమే ఆగినట్టుగా, దొరికేసరికి చేతిలో కవర్లు పట్టుకొని సిద్దంగా వున్నారు. ఎనిమిదింటికి రూములోకి వెళితే, ఎనిమిది అయిదుకి గ్లాసులు నింపి సిద్దమయ్యాం. కాకపోతే, మాకు అక్కడికి, మైసూరుకి పెద్ద తేడా తెలీలేదు. మామూలుగానే అనిపించింది. ఇక ఆ మర్నాడు కూనూరు చూసుకుని కొడైకనాల్ బయలుదేరాం. దార్లోనే కదా అని మధ్యలో పళని గుడి కూడా చూసేసాం. పళని అంగానే మాకందరికి గుర్తొచ్చే విశయం ఒకటుంది. దానికి ఆద్యం మాకున్న ఒక గొప్ప ఫ్రెండు. పేరు - కిరణ్ అలియాస్ . నిజం చెప్పొద్దూ, వీడు మన తోటరాముడు గారి దినకర్ కి కజిన్ బ్రదర్. తమిళనాడు బార్డర్ కి పక్కనే వున్న వూర్లో పుట్టి పెరగడం మూలాన నాకు తమిళ్ వచ్చు అని చెప్పేవాడు. దార్లో పళనిలో ఆగిదాం అని చెప్పగానే వాడు చెప్పాడు... నేను ఇదివరకు వెళ్లాను, కొండ పైవరకు రోడ్డు వుంటుంది, బండి నేరుగా గుడి ముఖద్వారం ముందు ఆగుతుంది అని చాలా చెప్పాడు. గుడి గురించి ముందు చెప్పినవాడు కొండ పైకి నడిచి వెళ్లాలి అని చెప్పినప్పుడు పుట్టిన కంగారు వాని మాటలతో దూరం అయ్యింది కూడా.
గుడిదాకా వెళ్లాక కానీ మాకు అర్థం కాలేదు. తీరా వెళ్లి చూస్తే అక్కడ కొండపైకి వున్నది రోడ్డు కాదు... రోప్వే. వాడు వెళ్లి ఎవరితోనో మాట్లాడి వచ్చి నదిచి ఎక్కితే మూడు గంటలు పడుతుందంట అన్నాడు. కొండ చూస్తే చిన్నగా వుంది, ట్రై చేద్దాం అని నడిస్తే ఎక్కడానికి 30 నిమిషాలు పట్టింది. ఎమైతేనేం, దర్శనం అయ్యింది. ఆరోజు సాయంత్రం ఆరుగంటలప్పుడు కొడై చేరుకున్నాం. నాకైతే ఊటీ కంటే కొడై బాగా నచ్చింది. రూములు తీస్కొని ఫ్రెషాయ్యక వెళ్లి వూరిమీద పడ్డాం. అక్కడికి మాకేదో అక్కడ ఆ టైంలో ఏదో చూసేద్దామని గుల పుట్టి కాదు కానీ, మా పని మీద మేము వెళ్లాం(ఆ పనేంటో అర్థం అయినవాళ్లు యువతరం కింద లెఖ్ఖ). అదేంటో, కొడై బస్టాండుకి మూడు దిక్కులా ఒక అరకిలోమీటరు వెళ్లాం. కనిపించిన ప్రతీ షాపులో అడిగాం. కూల్డ్రింకు కావాలి అంటే ఒక్కనిదగ్గరా ఫ్రిజ్జు లేదు. ప్రతీవాడూ అదేదో చిప్స్ పాకెట్ ఇచ్చినట్టు కబ్బొర్డులోంచి తీసిస్తున్నాడు. ఇప్పుడేం చెయ్యాలా అని మేమందరం ఒక షాపు ముందు నుల్చుని మా అంతర్జాతీయ మహాసభ నిర్వహిస్తూంటే ఇదంతా పక్కన వుండి అబ్సర్వ్ చేస్తున్న ఒకాయన మమ్మల్ని పిలిచి తెలుగులో మాకు అక్కడి వాతావరణం గురించి ఒక ఐదు నిమిషాలు క్లాసుపీకి, ఇది నాచ్యురల్ కోల్డు, మీకు పనికి వస్తుంది, ఇక్కడ హీటర్లే కానీ ఫ్రిజ్జులు వాడరు అని చెప్పి పంపాడు. కూనూర్లో కంటే కొడైలో ఆ రాత్రి మేము బాగా ఎంజాయ్ చేసాం.
ఇక్కడ ఒక విషయం చెప్పుకోవాలి. నాకు తెల్లవారుఝామున వచ్చిన కలలన్నీ నిజం అవుతుంటాయి. కానీ అదేంటో, అలా ఏదైనా కల వచ్చినప్పుడు లేవాగానే అనుకుంటా... ఇది జరిగే ఛాన్స్ లేదు అనో, లేకపోతే నిజ జీవితంలో ఇది జరగకుండా చూసుకోవాలి అనో... కానీ అది జరిగేవరకూ మళ్లీ అది గుర్తుకురాదు. ఇది ఇప్పుడు ఎందుకు చెప్పానంటే, నాకు ఊటీ వెళ్లడానికి ఒక రెండు నెలల ముందు ఒక కల వచ్చింది. అందులో మా బ్యాచ్ అంతా వున్నాం. అందరం గంటకు 10 రూపాయల అద్దె పెట్టి సైకిల్లు అద్దెకి తీసుకున్నట్టు. లేవగానే అనుకున్నా... ఇండియాలో గంటకి 10 రూపాయల అద్దెతో సైకిల్ తీసుకునే రేటు రావడానికి ఇంక చాలారోజులు పడుతుంది... అయినా నా రూమ్మేటు(మా బ్యాచులో, కలలో వాడు కూడా వున్నాడు కదా) సైకిలు రెంటుకి తీసుకుని తొక్కే సీనే లేదు అని. కానీ, మా వూరి వాగులో నీరు లేదు, నా ఆలోచనలో అర్థం లేదు. నా తెల్లవారుఝాము కలని నిజం కాకుండా ఆపే ధైర్యం ప్రకృతి చేయలేకపోయింది. అక్కడ ఒక లేక్ వుంది. దాని చుట్టు అందమైన రోడ్ వుంది. ఆ రోడ్ మీద సైకిలేసుకుని తిరగడం కూడా ఒక అనుభవమే. అందరూ ఆ అనుభవాన్ని అస్వాదించాలని, కొందరు ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు(????) అక్కడ ఆ రోజుల్లో గంటకు పది రూపాయల అద్దెపై ఇచ్చేవారు. ఇంకేముంది... "కల నిజమాయెగా, సైకిల్ నేను తొక్కగా" అని పాడేసుకుంటూ అందరం సైకిల్ తొక్కేసాం. మొత్తం ట్రిప్లో నేను అన్నిటికంటే ఎక్కువగా ఎంజాయ్ చేసిన ఘట్టం ఈ గంటన్నర సేపే.
అదేంటో, రిటర్న్జర్నీలో మా షుమేకర్కి మాంఛి మూడ్ వచ్చినట్టుంది... ఒంట్లో వున్న ఎనర్జీనతా కాల్లల్లోకి తెచ్చుకొని అక్సిలరేటర్ తెగ తొక్కేసాడు. ఏముంది... తెల్లారేసరికి మళ్లీ మైసూరులోకొచ్చి పడ్డాం. కానీ కమర్షియలైజేషన్ వల్ల సంభవించే పరిణామాలు ఎలా వుంటాయో నాకప్పుడు తెలిసింది. ఊటీ కమర్షియల్గా అభివ్రుద్ది చెందింది... ప్రతిగా అందాన్ని త్యాగం చేసింది. కానీ, అభివృద్ది తక్కువగా వున్న కొడైలో అందం, ఆనందం, ఆహ్లాదం తాండవం చేస్తున్నాయి అని.
Katthi ga vundi.
రిప్లయితొలగించండిNaaku nachindirooooooooooooooo :)